Telugu Global
Andhra Pradesh

ఏపీ నేతలపై బీఆర్ఎస్ కన్ను

విజయవాడలో పార్టీ ఆఫీస్‌ ఏర్పాటు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్‌ అనుకున్నారట. ఆ సభ జరిగేనాటికి కొందరు నేతలనైనా పార్టీలో చేరేట్లుగా ఒప్పించాలని తలసానిని ఆదేశించినట్లు సమాచారం. టికెట్లు రాని వివిధ పార్టీల్లోని నేతలు బీఆర్ఎస్ వైపు చూసే అవకాశాలు ఎక్కువున్నాయి.

ఏపీ నేతలపై బీఆర్ఎస్ కన్ను
X

ఏపీలో కూడా యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్న జాతీయ పార్టీ బీఆర్ఎస్ లోకల్ నాయకత్వంపై కన్నేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఆహ్వానంపంపిందట. తమ పార్టీలో చేరాలని మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ ఆహ్వానించారని సమాచారం. వైజాగ్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు లక్ష్మీనారాయణ ఈ మధ్యనే ప్రకటించారు. పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు కానీ ఏ పార్టీ అన్నది చెప్పలేదు.

కొంతమందేమో ఆప్‌లో చేరి రాష్ట్ర కన్వీనర్ బాధ్యతలు తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మళ్ళీ జనసేనలో చేరటానికి మాజీ జేడీ ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇవేమీకాదు వైజాగ్ ఎంపీగా ఇండిపెండెంట్‌గా ప్రతిపక్షాల మద్దతుతో పోటీచేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే హఠాత్తుగా బీఆర్ఎస్ నుండి నారాయణకు ఆహ్వానం అనే విషయం బయటపడింది. పార్టీ ఆఫీస్‌ను ఏర్పాటు చేసేందుకు తలసాని విజయవాడ రాబోతున్నారు.

ఈ సందర్భంగానే తలసాని కొందరు నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు ఆహ్వానం పంపినట్లుగానే కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలతోను, ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగి తర్వాత కాలంలో యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలతో బీఆర్ఎస్ నేతలు టచ్‌లోకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయవాడలో పార్టీ ఆఫీస్‌ ఏర్పాటు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్‌ అనుకున్నారట. ఆ సభ జరిగేనాటికి కొందరు నేతలనైనా పార్టీలో చేరేట్లుగా ఒప్పించాలని తలసానిని ఆదేశించినట్లు సమాచారం. టికెట్లు రాని వివిధ పార్టీల్లోని నేతలు బీఆర్ఎస్ వైపు చూసే అవకాశాలు ఎక్కువున్నాయి.

ఏదేమైనా ఏపీలోని కొన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయటం ఖాయమనే అనిపిస్తోంది. అయితే ఎన్ని సీట్లు, ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే విషయాన్ని మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదట. తమ పార్టీలో చేరే నేతలను బట్టి నియోజకవర్గాలు, వాటి సంఖ్యను ఫైనల్ చేయవచ్చని కేసీయార్ అనుకుంటున్నట్లు తెలిసింది. ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసే బాధ్యతలను కేసీఆర్‌ మంత్రి తలసానికి అప్పగించారట. ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్‌గా లేని నేతలు చాలా మందే ఉన్నారు. మరెంత మంది చేరుతారో చూడాలి.

First Published:  14 Dec 2022 5:34 AM GMT
Next Story