Telugu Global
Andhra Pradesh

పకోడీగాళ్లనే కామెంట్లపై బీజేపీ గరం గరం

పకోడీగాళ్లనే కామెంట్లపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటి వరకూ వైసీపీని పెద్దగా టార్గెట్ చేయని నేతలు కూడా కొడాలిని అడ్డుపెట్టుకుని పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

పకోడీగాళ్లనే కామెంట్లపై బీజేపీ గరం గరం
X

మాజీ మంత్రి కొడాలి నాని సహజంగా చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతుంటారు, అప్పుడప్పుడు పవన్ కల్యాణ్ కూడా ఆయనకు టార్గెట్ గా మారతారు. ఇటీవల కొడాలి వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారింది పరిస్థితి. ఏపీ బీజేపీ ఇన్ చార్జ్ సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలపై కొడాలి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఆ కౌంటర్ కు మళ్లీ రివర్స్ కౌంటర్లు వేస్తోంది బీజేపీ. బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ఆల్రడీ సవాళ్లు విసరగా, తాజాగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొడాలికి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించబోమని పరోక్షంగా హెచ్చరించారు.

అసలేం జరిగింది..?

నియోజకవర్గాల వారీగా వైసీపీ ఎమ్మెల్యేలపై చార్జి షీట్లు పెడుతున్న బీజేపీ.. గుడివాడ నియోజకవర్గంలో అవినీతి జరిగిందని, అభివృద్ధి లేదని విమర్శలు ఎక్కుపెట్టింది. సంక్రాంతి పండగను సైతం క్యాసినో, క్యాబిరే డ్యాన్స్‌లుగా మార్చేశారని, గుడివాడ యువతను కొడాలి నాని సర్వనాశనం చేశారని మండిపడ్డారు సునీల్ దియోధర్. కొడాలి నానీని జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలని గుడివాడ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని బూతులకు మాత్రమే ఫేమస్ అన్నారు.

ఈ క్రమంలో కొడాలి కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సునీల్ దియోధర్ లాంటి పకోడీ గాళ్ల వల్లే కర్నాటకలో బీజేపీ దిగజారిపోయిందని, ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. మళ్లీ బీజేపీని అధికారంలోకి తేవడానికి మోదీ, అమిత్ షా కష్టపడుతుంటే, ఇలాంటి పకోడీ గాళ్ళు నోటికొచ్చింది మాట్లాడుతూ పార్టీకి నష్టం చేస్తున్నారన్నారు.

పకోడీగాళ్లనే కామెంట్లపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటి వరకూ వైసీపీని పెద్దగా టార్గెట్ చేయని నేతలు కూడా కొడాలిని అడ్డుపెట్టుకుని పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేతలంతా మూకుమ్మడిగా మాటల యుద్దం మొదలు పెట్టారు.

First Published:  20 May 2023 1:55 AM GMT
Next Story