Telugu Global
Andhra Pradesh

ఏలూరులో టీడీపీకి షాక్.. వైసీపీలోకి మాగంటి బాబు.!

ఏలూరు ఎంపీ టికెట్ ఆశించిన మాగంటి బాబుకు చంద్రబాబు హ్యాండిచ్చారు. యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్‌ యాదవ్‌ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు.

ఏలూరులో టీడీపీకి షాక్.. వైసీపీలోకి మాగంటి బాబు.!
X

ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వర రావు అలియాస్‌ బాబు వైసీపీలో చేరతారని ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో వైసీపీ నేతలతో మాగంటి బాబు చర్చలు జరుపుతున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. మాగంటి బాబు బాటలోనే మరో నేత గోరుముచ్చు గోపాల్‌ యాదవ్ సైతం వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. వైసీపీలో వీరిద్దరి చేరిక దాదాపు ఖాయమని సమాచారం. అధికారిక ప్రకటనే మిగిలి ఉందని మాగంటి వర్గీయులు చెప్తున్నారు.

ఏలూరు ఎంపీ టికెట్ ఆశించిన మాగంటి బాబుకు చంద్రబాబు హ్యాండిచ్చారు. యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్‌ యాదవ్‌ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. ఈ నిర్ణయంతో మాగంటి బాబు, గోరుముచ్చు గోపాల్ యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు టికెట్ రాకపోవడానికి యనమల రామకృష్ణుడే కారణమని ఈ ఇద్దరు నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఏలూరు రాజకీయాల్లో టీడీపీ తరపున మాగంటి బాబు చక్రం తిప్పారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ చేతిలో ఓడిపోయారు. అయితే ఈ సారి కూడా టికెట్ ఆశించిన మాగంటి బాబుకు నిరాశే ఎదురైంది. మాగంటి బాబు వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారంతో ఏలూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ ఇప్పటికే కారుమూరి సునీల్‌ కుమార్‌ను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది.

First Published:  26 March 2024 10:25 AM GMT
Next Story