Telugu Global
Andhra Pradesh

ఏపీ హైకోర్టులో నారా లోకేశ్‌కు భారీ ఊరట

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేశ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వేశారు.

ఏపీ హైకోర్టులో నారా లోకేశ్‌కు భారీ ఊరట
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో లోకేశ్ బెయిల్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. ఈ కేసులో లోకేశ్‌ను అసలు ముద్దాయిగా చూపలేదని సీఐడీ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ముద్దాయిగా చూపనందున లోకేశ్‌ను అరెస్టు చేయబోమని హైకోర్టుకు సీఐడీ తరపు న్యాయవాది చెప్పారు. ఒక వేళ కేసులో పేరు చేర్చితే మాత్రం 41ఏ నిబంధనలు అనుసరిస్తామని కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో లోకేశ్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేశ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వేశారు. తనను ఈ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరడంతో హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా, ఈ పిటిషన్‌పై సీఐడీ తరపు లాయర్లు వివరణ ఇచ్చారు. ఆయనను అరెస్టు చేసే ఆలోచన ఇప్పుడు లేదని... అసలు కేసులో లోకేశ్ పేరు చేర్చలేదని పేర్కొన్నారు. కేవలం చంద్రబాబు కుటుంబీకులకు స్కాం ద్వారా సంపాదించిన అక్రమ డబ్బు అందిందని మాత్రమే పేర్కొన్నట్లు తెలిపారు. లోకేశ్‌ పేరు చేర్చాలని సీఐడీ అనుకుంటే.. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని తెలిపారు.

మరోవైపు అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్‌పై ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై శుక్రవారం తీర్పు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. ఇక స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీనికి సంబంధించిన విచారణ ఈ నెల 17న చేపడతామని ఉన్నత న్యాయస్థానం చెప్పింది.


First Published:  12 Oct 2023 8:30 AM GMT
Next Story