Telugu Global
Andhra Pradesh

జగన్ పై బండి సంజయ్ సెటైర్లు..

దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఏపీలో వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు బండి సంజయ్.

జగన్ పై బండి సంజయ్ సెటైర్లు..
X

తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు చేస్తారా..?

మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా..?

భక్తులను తిరుమల రాకుండా చేస్తారా..? కాపాడలేక కర్రలిస్తారా..?

అంటూ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు బండి సంజయ్. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణమని చెప్పారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఏపీలో వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు బండి సంజయ్.

ఏపీలో మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోందన్నారు బండి సంజయ్. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేలపైగా నకిలీ ఓట్లు చేర్పించారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంపై సీరియస్ గా ఉందన్నారు. ఓటర్ లిస్ట్ లో అక్రమాలకు పాల్పడటం వల్లే అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు.

పవన్ పై పొగడ్తలు..

పవన్ ప్రజాభిమానం ఉన్న నేత అని అన్నారు బండి సంజయ్. ప్రజా సమస్యలపై ఆయన జనంలోకి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణం అని చెప్పారు. దొంగ పాదయాత్రలతో జగన్ అధికారంలోకి వచ్చారని, ఈరోజు నిజమైన పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ కుట్రచేస్తున్నారని మండిపడ్డారు. తిరుమలతో అడవులున్న విషయమే తెలియదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నారని, ఆయనకు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమో అని ఎద్దేవా చేశారు బండి.

First Published:  21 Aug 2023 1:55 PM GMT
Next Story