Telugu Global
Andhra Pradesh

మూడో కన్ను తెరుస్తా జాగ్రత్త.. వైసీపీ ఎమ్మెల్యేకి బాలయ్య వార్నింగ్

రాజకీయాలకి సినిమాలకి ముడిపెట్టొద్దని సూచించారు. రాజకీయాల్లో చూసుకుందాం రండి, సినిమాలపై మీ ప్రతాపమేంటి అని ప్రశ్నించారు.

మూడో కన్ను తెరుస్తా జాగ్రత్త.. వైసీపీ ఎమ్మెల్యేకి బాలయ్య వార్నింగ్
X

సినిమా స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. సినిమా అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న ఆయన వైసీపీ ఎమ్మెల్యేకి హెచ్చరికలు జారీ చేశారు. నేను చిటికేస్తే ఏం జరుగుతుందో తెలుసుకో, మూడో కన్ను తెరిచానంటే ఏమవుతుందో చూస్కో అంటూ హెచ్చరించారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఆయన పరోక్షంగా ధ్వజమెత్తారు.

గుంటూరు జిల్లా తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర పురస్కార మహోత్సవం జరిగింది. బాలకృష్ణ చేతుల మీదుగా సావిత్రి కుమార్తె చాముండేశ్వరి, నిర్మాత నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథ రెడ్డికి ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య నర్సరావుపేట ఎమ్మెల్యేకి వార్నింగ ఇచ్చారు.

అసలు ఏం జరిగింది..?

ఇటీవల నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో బాలకృష్ణ సినిమా పాటల్ని పెట్టారు. ఆ పాటలు వస్తుండగా వాటిని ఆపేయాలంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్వాహకుల్ని ఆదేశించారు. ఈ విషయం టీడీపీ నాయకులకు తెలిసింది. వారు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను ఒక కులం వారికోసమో, ఒక పార్టీ వారికోసమో సినిమాలు చేయట్లేదని, సినిమావాళ్లంతా ప్రజలందరికోసమే నటించి రంజింపజేయాలనుకుంటారని అన్నారు. రాజకీయాలకి సినిమాలకి ముడిపెట్టొద్దని సూచించారు. రాజకీయాల్లో చూసుకుందాం రండి, సినిమాలపై మీ ప్రతాపమేంటి అని ప్రశ్నించారు. చదువుకున్నవాడివి, ప్రజా సేవ చేయడానికి వచ్చావంటే ఎవరూ ఏమీ అనరు, కానీ సినిమాల విషయంలో రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోను అని హెచ్చరించారు బాలయ్య. నేను చిటికేస్తే చాలు అని వార్నింగ్ ఇచ్చారు.

First Published:  15 March 2023 10:42 AM GMT
Next Story