Telugu Global
Andhra Pradesh

దాడి చేసింది టీడీపీ వాళ్లే.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

తన కొడుకు పరిస్థితి ఏంటా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారని, ఫ్రస్టేషన్‌లో వరస్ట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు బాలినేని.

దాడి చేసింది టీడీపీ వాళ్లే.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
X

సీఎం జగన్ పై జరిగిన దాడి అల్లరిమూకల పని అంటూ వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. అల్లరి మూకలు ఇలాంటి దాడులకు పాల్పడే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేయాల్సిన అవసరం వారికి ఎందుకు ఉంటుందన్నారు. ఇది టీడీపీ చేసిన పని అని, బాధ్యులను విచారణ చేసి పట్టుకుంటామన్నారు. వరుసగా రెండో సారి ఏపీ ప్రజలు టీడీపీకి బుద్ది చెబుతారన్నారు బాలినేని. ఈ దాడికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజలు 150 సీట్లతో మరోసారి వైసీపీకి పట్టం కడతారని అన్నారు బాలినేని. టీడీపీ వాళ్ళే దాడులు చేయిస్తారు, మళ్ళీ వాళ్ళే కుట్రలు అంటున్నారని మండిపడ్డారు. సీఎంగా పని చేసినవారు ఎవరైనా చీప్ పనులు చేస్తారా అని ప్రశ్నించారు. కొద్దిగా ఉంటే రాయి కంటికి తగిలేదని, అప్పుడు పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ వాళ్లకు మైండ్ పాడైందని.. పెన్షన్లు, వాలంటీర్లపై కూడా రోజుకో రకంగా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని.. ఆయనకు వయసైపోయిందని విమర్శించారు. తన కొడుకు పరిస్థితి ఏంటా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారని, ఫ్రస్టేషన్‌లో వరస్ట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు బాలినేని.

సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు బాలినేని. టీడీపీ సభలు వెలవెలబోతున్నాయని, అదే సమయంలో సీఎం సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారని.. అందుకే టీడీపీ వాళ్లు భౌతిక దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. ఇటీవల ఒంగోలులో తమ కుటుంబంపై కూడా టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్దతి కాదన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు బాలినేని.

First Published:  14 April 2024 3:13 AM GMT
Next Story