Telugu Global
Andhra Pradesh

లారీతో గుద్ది.. తండ్రిని హ‌త‌మార్చిన కొడుకు

ఆ త‌ర్వాత తండ్రీకొడుకుల మ‌ధ్య వివాదం కొన‌సాగి.. మ‌రింత ముదిరింది. ఈ నేప‌థ్యంలో కుమారుడు లారీని ముందుకు క‌దిలించ‌బోతుండ‌గా, అత‌ని తండ్రి మ‌హ‌బూబ్ బాషా లారీకి అడ్డుగా నిల‌బ‌డ్డాడు.

లారీతో గుద్ది.. తండ్రిని హ‌త‌మార్చిన కొడుకు
X

క‌న్న తండ్రిని లారీతో తొక్కించి హ‌త‌మార్చిన దారుణ ఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో బుధ‌వారం జ‌రిగింది. క‌డ‌ప జిల్లా ముద్ద‌నూరు మండ‌లం కొర్ర‌పాడు వీరి స్వ‌స్థ‌లం. తండ్రి పేరు మ‌హ‌బూబ్ బాషా (52), కొడుకు పేరు ష‌ఫీ. వీరిద్ద‌రూ సిమెంటు లోడుతో లారీలో నెల్లూరుకు బ‌య‌లుదేరారు. వీరితో పాటు మ‌రో డ్రైవ‌ర్ ఓబ‌య్య కూడా ఉన్నాడు. కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో వీరిద్ద‌రి మ‌ధ్య లారీలోనే వివాదం మొద‌లైంది. అది దారి పొడ‌వునా కొన‌సాగుతూనే ఉంది. నెల్లూరు జిల్లా మ‌ర్రిపాడు మండ‌లం రాజుపాళెం వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి గొడ‌వ బాగా ముదిరింది. తండ్రీకొడుకుల గొడ‌వ‌తో విసుగెత్తిపోయిన డ్రైవ‌ర్ ఓబ‌య్య రాజుపాళెం వ‌ద్ద లారీని ఆపేసి వెళ్లిపోయాడు.

ఆ త‌ర్వాత తండ్రీకొడుకుల మ‌ధ్య వివాదం కొన‌సాగి.. మ‌రింత ముదిరింది. ఈ నేప‌థ్యంలో కుమారుడు లారీని ముందుకు క‌దిలించ‌బోతుండ‌గా, అత‌ని తండ్రి మ‌హ‌బూబ్ బాషా లారీకి అడ్డుగా నిల‌బ‌డ్డాడు. అప్ప‌టికే తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న కుమారుడు ష‌ఫీ లారీతో తండ్రిని తొక్కించాడు. అత‌ను అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న అనంత‌రం ష‌ఫీ అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు వివ‌రాలు సేక‌రించ‌గా, వివాదం విష‌యం తేలింది. నిందితుడు ష‌ఫీ కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

First Published:  2 Feb 2023 2:41 AM GMT
Next Story