Telugu Global
Andhra Pradesh

ఆర్డినెన్స్ వచ్చేసింది.. అసైన్డ్ కష్టాలకు చెల్లు చీటీ

ప్రభుత్వం భూములు అసైన్ చేసి 20ఏళ్లు దాటితే వాటిని అమ్ముకునే అవకాశాన్ని యజమానులకు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇక ఇంటి స్థలాల విషయంలో పదేళ్లకే వాటిని అమ్ముకునే హక్కుని యజమానులకు కల్పించింది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని కూడా తాజా ఆర్డినెన్స్ లో పేర్కొంది.

ఆర్డినెన్స్ వచ్చేసింది.. అసైన్డ్ కష్టాలకు చెల్లు చీటీ
X

అసైన్డ్ భూముల విషయంలో వాటిని అమ్ముకునే హక్కు కూడా లబ్ధిదారులకు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ భూ బదలాయింపు చట్టం-1977 ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చింది. గత మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఆర్డినెన్స్ రూపంలో అది అమలులోకి రావడంతో అసైన్డ్ భూమల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చే భూముల విషయంలో ఇప్పటి వరకూ కఠిన నిబంధనలు ఉండేవి. ప్రభుత్వం అసైన్ చేసిన భూముల క్రయ విక్రయాలకు అధికారికంగా అవకాశం లేదు. వాటిపై ఎప్పటికైనా వారసులకే హక్కు ఉంటుంది. అందుకే అత్యవసరమైనా వాటిని అమ్ముకోలేరు యజమానులు. ఒకవేళ అమ్మినా, అసైన్డ్ భూములకు రేటు ఉండేది కాదు, న్యాయపరమైన చిక్కులుంటాయనే ఉద్దేశంతో తక్కువరేటుకే వాటిని కొనేవారు. ఆ భూములు రిజిస్ట్రేషన్లు కూడా కావు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తోంది. అందులో భాగంగానే ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది.

ప్రభుత్వం భూములు అసైన్ చేసి 20ఏళ్లు దాటితే వాటిని అమ్ముకునే అవకాశాన్ని యజమానులకు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇక ఇంటి స్థలాల విషయంలో పదేళ్లకే వాటిని అమ్ముకునే హక్కుని యజమానులకు కల్పించింది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని కూడా తాజా ఆర్డినెన్స్ లో పేర్కొంది. అంటే.. ప్రభుత్వం అసైన్ చేసిన ఇంటి స్థలాన్ని పదేళ్ల తర్వాత లబ్ధిదారులు అమ్ముకోవచ్చు, పొలం అయితే 20 ఏళ్ల తర్వాత దానిపై క్రయ విక్రయాలకు అవకాశం లభిస్తుంది.

First Published:  4 Aug 2023 2:36 AM GMT
Next Story