Telugu Global
Andhra Pradesh

వాలంటీర్లకు జీతాలు పెంచుతాం.. టీడీపీ కవరింగ్ కష్టాలు

అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారని గుర్తు చేశారు అచ్చెన్నాయుడు. దానికే కూటమి కట్టుబడి ఉందని చెప్పారు.

వాలంటీర్లకు జీతాలు పెంచుతాం.. టీడీపీ కవరింగ్ కష్టాలు
X

ఏపీలో వాలంటీర్లను టెర్రరిస్ట్ లతో పోలుస్తూ శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. గతంలో కూడా టీడీపీ, జనసేన నేతలు వాలంటీర్లపై విమర్శలు చేశారు, బొజ్జల వ్యాఖ్యలు వాటికి పరాకాష్టగా నిలిచాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి కూడా రివర్స్ అటాక్ మొదలైంది. బొజ్జల వ్యాఖ్యలతో టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉండటంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. ఆ వ్యాఖ్యలతో టీడీపీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

ఆయన వ్యక్తిగతం..

వాలంటీర్లపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్నారు. అయినా బొజ్జల అందరు వాలంటీర్లను ఆ మాట అనలేదని, కోడ్ ఉల్లంఘించి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మక్కయిన కొందరిని మాత్రమే అన్నారని కవర్ చేశారు అచ్చెన్న. చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్న వాలంటీర్లను టీడీపీ సమర్థించదని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 200మంది వాలంటీర్లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సస్పెండ్ అయ్యారని, వారి భవిష్యత్తుని వారే పాడుచేసుకున్నారని చెప్పారు అచ్చెన్నాయుడు.

జీతాలు పెంచుతాం..

అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారని గుర్తు చేశారు అచ్చెన్నాయుడు. దానికే కూటమి కట్టుబడి ఉందని చెప్పారు. వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని, బొజ్జల వ్యాఖ్యలను అందరికీ వర్తింపజేయలేమని కవర్ చేయాలని చూశారు. అయితే ఇప్పటికే నష్టం జరిగిపోయింది. వ్యక్తిగతంగా చాలామంది వాలంటీర్లు ఏ పార్టీకి చెందినవారు కాదు. కానీ టీడీపీ వారిని కించపరుస్తున్న తీరు, టీడీపీ నేతల వ్యాఖ్యలు వింటుంటే వాలంటీర్లలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాలంటీర్లు వన్ సైడ్ అయితే ఆ ప్రభావం ఎన్నికలపై స్పష్టంగా కనపడుతుంది. అందుకే టీడీపీ భయపడుతోంది.

First Published:  26 March 2024 11:08 AM GMT
Next Story