Telugu Global
Andhra Pradesh

నిమిషం లేటుగా వస్తే గేటు బయటే.. ఏపీలో టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు..

పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, ఇన్విజిలేటర్లు కూడా సెల్ ఫోన్లు తేవడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు అధికారులు. ప్రభుత్వ టీచర్లు మాత్రమే ఇన్విజిలేటర్లుగా ఉంటారు.

నిమిషం లేటుగా వస్తే గేటు బయటే.. ఏపీలో టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు..
X

ఈనెల 3వతేదీ నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాల్లో.. 6,69,070 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. ఉదయం 9.30గంటలనుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరుగుతుంది. 9.31 దాటిన తర్వాత ఎవ్వరినీ పరీక్ష హాల్ లోకి అనుమతించరు. ఒకవేళ వ్యక్తిగత కారణం చెబితే స్థానిక స్టాఫ్ విచక్షణపై అనుమతిచ్చే విషయంపై ఆలోచిస్తున్నట్టు తెలిపారు మంత్రి బొత్స సత్య నారాయణ.

ఆర్టీసీలో ఉచిత ప్రయాణం..

టెన్స్ క్లాస్ విద్యార్థులు ఈనెల 3 నుంచి 18 వరకు పరీక్ష జరిగే తేదీల్లో ఆయా సమయాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిచవచ్చు. వారి హాల్ టికెట్లే, వారికి బస్ టికెట్లుగా ఉపయోగపడతాయని తెలిపారు మంత్రి బొత్స.

సెల్ ఫోన్లకు అనుమతి లేదు..

పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, ఇన్విజిలేటర్లు కూడా సెల్ ఫోన్లు తేవడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు అధికారులు. మొత్తం ఆరు సబ్జెక్ట్‌ లకు ఆరు పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. ప్రభుత్వ టీచర్లు మాత్రమే ఇన్విజిలేటర్లుగా ఉంటారు. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ లో పరీక్షలు పెడితే.. అక్కడ కూడా ఇన్విజిలేటర్లతో సహా సహాయ సిబ్బంది అందరూ ప్రభుత్వ ఉద్యోగులే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించారు. సెల్ ఫోన్ సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఇన్విజిలేటర్లు కూడా తీసుకుని రావద్దని చెప్పారు. పరీక్షల సమయంలో తనిఖీలకు 800 స్క్వాడ్‌ లు ఏర్పాటు చేశారు.

ఒంటిపూట బడులు..

ఈనెల 3నుంచి టెన్త్ పరీక్షల ప్రారంభంతోపాటు, అదే రోజు నుంచి ఒంటిపూట బడులు మొదలుపెడతామని చెప్పారు మంత్రి బొత్స. ప్రైవేట్ పాఠశాలలు కూడా మూడో తేదీ నుంచి ఒంటి పూట మాత్రమే బడులు నిర్వహించాలి అని స్పష్టం చేశారు.

First Published:  1 April 2023 7:30 AM GMT
Next Story