Telugu Global
Andhra Pradesh

పెన్షన్ పాపం మాదే.. ఒప్పేసుకున్న టీడీపీ

నేరుగా వాలంటీర్లపై ఫిర్యుదులు చేస్తే ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని, అందుకే శాంతి భద్రతల అంశంగా దాన్ని చిత్రీకరించామని ఒప్పేసుకున్నారు ఆదిరెడ్డి వాసు.

పెన్షన్ పాపం మాదే.. ఒప్పేసుకున్న టీడీపీ
X

అవ్వా తాతలకు ఒకటో తేదీ పెన్షన్ అందకుండా అడ్డుకున్నదెవరు..? వాలంటీర్లను విధులకు దూరం చేసింది ఎవరు..? వికలాంగులు, వృద్ధులు.. సచివాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొచ్చిందెవరు..? సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అనే సంస్థ ఫిర్యాదు వల్లే ఇదంతా జరిగిందనేది బయటకు ప్రచారంలో ఉన్న విషయం. ఆ సంస్థ వెనక ఉన్నది చంద్రబాబేననేది కూడా వాస్తవం. కానీ బాబు మాత్రం తన ప్రమేయం లేనట్టు.. కవర్ చేసుకుంటున్నారు. వాలంటీర్ల విషయంలో టీడీపీపై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు విషయం వేరే ఉంది. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా చేసింది తామేనని ఒప్పుకుంటున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త, రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు.

కుట్ర ఎలా జరిగిందంటే..?

నేరుగా వాలంటీర్లపై ఫిర్యుదులు చేస్తే ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని, అందుకే శాంతి భద్రతల అంశంగా దాన్ని చిత్రీకరించామని ఒప్పేసుకున్నారు ఆదిరెడ్డి వాసు. వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడానికి వెళ్తే వారి వెంట తాము కూడా వెళ్తామని, వైసీపీకి ప్రచారం చేయకుండా వారిని అడ్డుకుంటామని.. ఆ క్రమంలో గొడవలు జరిగే అవకాశముందని రిటర్నింగ్ అధికారికి తెలిపామంటున్నారు వాసు. దీంతో డీఎస్పీ కూడా తమ వాదనను సమర్థించాడని అన్నారు. అంటే.. వాలంటీర్లు పెన్షన్ పంపిణీకి వెళ్తే గొడవలు చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నదనమాట. గ్రామాల్లో ఘర్షణలు సృష్టించేందుకు వ్యూహాలు రచించిందనమాట. నిర్లజ్జగా మీడియా ముందే ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు ఆదిరెడ్డి వాసు. పెన్షన్ పంపిణీని అడ్డుకున్న పాపం తమదేనని తేల్చి చెప్పారు.


పెన్షన్ల వ్యవహారంలో వాలంటీర్లను తప్పించిన ఘనత తనదేనంటూ ఆదిరెడ్డి వాసు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే తమకి ఇబ్బంది ఎదురవుతుందనే అంశాన్ని చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్లామని, ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా దాన్ని అడ్డుకున్నామని ఆయన చెప్పారు. అలా చెప్పే క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తాము పన్నిన పన్నాగాన్ని కూడా ఆయన వివరించారు. ఈ వీడియో చూసిన వారంతా టీడీపీని ఛీ కొడుతున్నారు. పెన్షన్లు పెంచి ఇవ్వడమే కాకుండా, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిస్తున్న జగన్ పై కోపంతో వృద్ధులు, వికలాంగుల్ని టీడీపీ నేతలు ఇంత ఇబ్బంది పెట్టాలా అని మండిపడుతున్నారు. రాజకీయాలకోసం అవ్వాతాతల ఉసురు పోసుకుంటున్నారని అంటున్నారు. ఆ పాపం ఊరికే పోదని శాపనార్థాలు పెడుతున్నారు.

First Published:  2 April 2024 5:13 PM GMT
Next Story