Telugu Global
Andhra Pradesh

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు బస చేస్తున్న ప్రాంతానికి అధిక సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు.

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్
X

ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పోలీసులు ఈ రోజు ఉదయం 6 గంటలకు అరెస్టు చేశారు. నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద తన కారవాన్‌లో బస చేసిన చంద్రబాబు.. బస్సు నుంచి బయటకు రాగానే పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కాగా, చంద్రబాబు అరెస్టు సమయంలో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు బస చేస్తున్న ప్రాంతానికి అధిక సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. చంద్రబాబు బస చేసిన బస్సు దగ్గరకు చేరుకున్న పోలీసులను తెలుగు దేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. అదే సమయంలో చంద్రబాబు తరపు లాయర్లు కూడా అక్కడకు చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని వాదించారు. నా హక్కులను ఎందుకు ఉల్లంఘిస్తున్నారని, నేను తప్పు చేస్తే నడిరోడ్డులో ఉరితీయండంటూ చంద్రబాబు అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో వాదించారు. కాగా, హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని పోలీసులు స్పష్టం చేశారు. ఆధారాలు చూపించాలని న్యాయవాదులు డిమాండ్ చేయగా.. రిమాండు రిపోర్టులో అన్నీ ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఏ1గా ఉన్నారు. ఆయన కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. స్కిల్ డెవలెప్‌మెంట్‌లో రూ.371 కోట్ల స్కాం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం 2020 ఆగస్టులో విచారణకు ఆదేశించింది. ఈ కేసులో చంద్రబాబు ఏ1, అచ్చెన్నాయుడు ఏ2గా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేశారు. ఇప్పటికే హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు చూపించామని చంద్రబాబుకు సీఐడీ అధికారులు స్పష్టం చేశారు.

చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, ఆర్/డబ్ల్యూ 109, 34 మరియు 37తో పాటు సెక్షన్ 12, 13(2) ఆర్/డబ్ల్యూ, 13(1)(సీ) అండ్ (డీ) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ - 1988 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు అని.. కేవలం కోర్టు ద్వారా మాత్రమే బెయిల్ తెచ్చుకునే వీలుంటుందని తెలుస్తున్నది.

చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీ నాయకుల తీవ్రంగా ప్రతిఘటించడంతో వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిల ప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఆర్కే ఫంక్షన్ హాల్లోనే ఉన్న చంద్రబాబును కాసేపట్లో విజయవాడకు తరలించే అవకాశం ఉన్నది. చంద్రబాబు అభ్యర్థన మేరకు తన కారులోనే, ఎన్ఎస్జీ సెక్యూరిటీ మధ్య మంగళగిరికి చంద్రబాబును తరలించనున్నారు.



First Published:  9 Sep 2023 1:13 AM GMT
Next Story