Telugu Global
Andhra Pradesh

రామోజీకి కొన్ని క‌నిపించ‌వు.. కొన్ని వినిపించ‌వు

అంబేద్కర్‌ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున జగన్‌ కట్టిస్తుంటే రామోజీరావుకి కనిపించడం లేదా? అని మంత్రి నిలదీశారు. చంద్రబాబు హయాంలో దళితుల మీద దాడులు జరిగితే నీ పత్రికలో ఎందుకు రాయలేదు రామోజీ అంటూ ప్రశ్నించారు

రామోజీకి కొన్ని క‌నిపించ‌వు.. కొన్ని వినిపించ‌వు
X

ఈనాడు పత్రికలో రామోజీ రాతలపై మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీల ఎదుగుదలకు సీఎం జగన్‌ మోకాలడ్డుతున్నాడంటూ తాజాగా రాసిన కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం మంత్రి మేరుగ నాగార్జున విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన పత్రికలో తానే విషం కక్కి.. మళ్లీ సీఎం వైఎస్‌ జగన్‌ దానికి సమాధానం చెప్పాలంటూ రాయడంపై మండిపడ్డారు. అసలు ఏపీ చరిత్రలోనే సామాజిక విప్లవానికి తెరతీసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మేరుగ చెప్పారు. అంబేద్కర్‌ ఆశయ సాధనలో సీఎం జగన్‌ పని చేస్తుంటే రామోజీకి కనపడటం లేదా అని నిలదీశారు.

ఈ సందర్భంగా మంత్రి మేరుగ జగన్‌ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడాను వివరించారు. సీఎం జగన్‌ నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయించారని, కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా వాటిని తీర్చిదిద్దారని వివరించారు. చంద్రబాబు హయాంలో మాత్రం 2 వేల పాఠశాలలను మూసివేసి పేద పిల్లలకు చ‌దువును దూరం చేసి, వారి జీవితాలను నాశనం చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో విదేశీ విద్య పేరుతో అక్రమాలకు పాలడ్డారని, దీనిపై ప్రస్తుతం విజిలెన్స్‌ విచారణ కూడా జరుగుతోందని చెప్పారు. రామోజీ రాసే అబద్ధాల రాతలను నమ్మే పరిస్థితిలో జనం లేరని ఈ సందర్భంగా మంత్రి స్పష్టంచేశారు.

జగన్‌ వచ్చాక పేద బతుకుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని మంత్రి చెప్పారు. ఎస్సీలను బాగు చేయడానికి కార్పొరేషన్లు పెట్టి నిధులు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి పైసా దళితులకు అందేలా చర్యలు చేపట్టినట్టు వివరించారు. దళిత క్రైస్తవులు చంద్రబాబుకు ఏనాడైనా కనిపించారా? రాజధానిలో దళితులు ఉండటానికి వీల్లేదని చంద్రబాబు కోర్టుకు వెళ్తే రామోజీరావు ఎందుకు రాయలేదు? ఇంగ్లీష్‌ మీడియం పేదలకు అవసరం లేదని కోర్టుకు వెళ్తే మీ పత్రికలో ఎందుకు రాయలేదు? రాజధానిలో అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టకుండా చంద్రబాబు కుట్ర పన్నితే ఎందుకు రాయలేదు.. అంటూ మేరుగ ప్రశ్నించారు.

అంబేద్కర్‌ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున జగన్‌ కట్టిస్తుంటే రామోజీరావుకి కనిపించడం లేదా? అని మంత్రి నిలదీశారు. చంద్రబాబు హయాంలో దళితుల మీద దాడులు జరిగితే నీ పత్రికలో ఎందుకు రాయలేదు రామోజీ అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో దళితులపై దాడిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ ఉందని తేలితే ఆ విషయాన్ని తన పత్రికలో రామోజీ ఎందుకు రాయలేదని నిలదీశారు. గిరిజనుల కోసం ఎస్టీ కమిషన్‌ను జగన్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. పోడు భూములకు పట్టాలిచ్చి భరోసా కల్పిస్తే ఎందుకు రాయలేదని నిలదీశారు. వైసీపీ హయాంలో గిరిజన యూనివర్సిటీ నిర్మిస్తుంటే ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. వీటన్నింటిపై తాము చర్చకు సిద్ధమేనని, టీడీపీ నేతలు, రామోజీరావు చర్చకు వస్తారా అంటూ మంత్రి సవాల్‌ చేశారు.

First Published:  1 Dec 2023 1:16 PM GMT
Next Story