Telugu Global
Andhra Pradesh

సాగర్ నీటికి తెలంగాణ పర్మిషన్ ఎందుకు..?

తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన, మరో పార్టీని ఓడించాల్సిన అవసరం తమకు లేదన్నారు మంత్రి అంబటి. తెలంగాణ రాజకీయాలపై వైసీపీకి ఆసక్తి లేదని, అక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదని చెప్పారు.

సాగర్ నీటికి తెలంగాణ పర్మిషన్ ఎందుకు..?
X

"మా నీరు మా రైతులకు విడుదల చేయాలంటే తెలంగాణ అనుమతి మాకెందుకు?.. మా భూభాగంగలోకి మా పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది..?" అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. సాగునీటి విడుదల కోసం పదే పదే తెలంగాణ రాష్ట్రం అనుమతి తీసుకోవాలా? అని మండిపడ్డారు. నాగార్జున సాగర్ నీటిలో ఏపీ వాటా ఎంతుందో అంతే నీటిని తాము వాడుకుంటున్నామని, ఒక్క చుక్క నీటిని కూడా ఎక్కువగా తీసుకోలేదని వివరణ ఇచ్చారు. ఇది చాలా సున్నితమైన అంశం అని, ఇక్కడ గొడవలు అవసరం లేదని చెప్పారు. సాగర్ పై ఏపీ పోలీసుల దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని, వాస్తవాలు గమనించాలని చెప్పారు అంబటి.


నాగార్జున సాగర్ గొడవ నిన్న మొదలు కాగా.. తెలంగాణ నుంచి ప్రతిపక్షం వెంటనే స్పందించింది, వామపక్షాలు కూడా మెల్లగా రాజకీయ లాభం కోసం కామెంట్లు మొదలుపెట్టాయి. ఈ దశలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఘాటుగానే స్పందించింది. ఏపీ ప్రభుత్వం ఎక్కడా తప్పు చేయలేదన్నారు అంబటి. ఏపీ పోలీసులు ఏపీకి చెందిన భూభాగంలోనే ఉన్నారని, కానీ తెలంగాణ పోలీసులే ఏపీలోకి వచ్చారని చెప్పారు.

తప్పంతా చంద్రబాబుదే..!

నాగార్జున సాగర్ వ్యవహారంలో తప్పంతా చంద్రబాబుదేనన్నారు అంబటి. సాగర్ కుడి కాల్వను తెలంగాణ ఆపరేట్ చేయడం చట్ట విరుద్ధం అన్నారాయన. తమ వాటాను వాడుకునే స్వేచ్ఛ తమకే ఉండాలన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిలైందని విమర్శించారు. ఏపీ హక్కుల్ని తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు అసమర్థత వల్ల తెలంగాణ పోలీసులు.. ఏపీ భూభాగంలోకి వచ్చారని చెప్పారు అంబటి.

బీఆర్ఎస్ కి ప్రయోజనమా..?

తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన, మరో పార్టీని ఓడించాల్సిన అవసరం తమకు లేదన్నారు మంత్రి అంబటి. తెలంగాణ రాజకీయాలపై వైసీపీకి ఆసక్తి లేదని, అక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదని చెప్పారు. కొందరు రెచ్చగొట్టి గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ కు చంద్రబాబు మద్దతు ఇచ్చారా? చంద్రబాబుకు చెందిన కుల సంఘాలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాయా..? అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ విషయంలో ఏపీ ప్రయోజనాలను కాపాడటంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఫెయిలైతే.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం సక్సెస్ అయిందని తేల్చి చెప్పారు అంబటి.


First Published:  1 Dec 2023 9:19 AM GMT
Next Story