Telugu Global
Andhra Pradesh

30న ఏపీ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు!.. ప‌రీక్ష రాయ‌నివారూ.. పాస్‌!

గోదావరి వరదల్లో ముంపునకు గురై సప్లిమెంటరీ పరీక్షలు రాయలేకపోయిన విద్యార్ధులకు ఇంటర్మీడియట్ బోర్డు తీపి కబురు అందించింది. పరీక్ష రాయలేకపోయినా విద్యార్థులను పాస్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

30న ఏపీ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు!.. ప‌రీక్ష రాయ‌నివారూ.. పాస్‌!
X

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు ఈనెల 30న విడుద‌ల చేసేందుకు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. దీనిపై బోర్డు అధికారిక ప్రకటనే త‌రువాయి. డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం కావడం, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మొదలవడంతో అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేయనుంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్ధుల కోసం ఆగస్టు 3 నుంచి 12 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెలిసిందే.

ఆన్‌లైన్‌లో ఫ‌లితాలు తెలుసుకోవ‌డం ఇలా..

ఫలితాలు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ bie.ap.gov.in లో పొందవచ్చు. లేదా ఇక్కడి లింక్ క్లిక్ చేసి నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌ లోకి వెళ్లవచ్చు. అధికారిక వెబ్ సైట్ లో రిజల్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2022 ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్ బటన్ పై క్లిక్ చేస్తే ఫలితాలు డిస్ప్లే అవుతాయి.

ఆ విద్యార్థుల‌కు తీపి క‌బురు..

గోదావరి వరదల్లో ముంపునకు గురై సప్లిమెంటరీ పరీక్షలు రాయలేకపోయిన విద్యార్ధులకు ఇంటర్మీడియట్ బోర్డు తీపి కబురు అందించింది. పరీక్ష రాయలేకపోయినా విద్యార్థులను పాస్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.గోదావరి ఉగ్రరూపంతో జులై, ఆగష్టుల్లో రెండుసార్లు గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు రెండో వారంలో వచ్చిన వరదల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, వీఆర్‌ పురం మండలాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆగస్టు 10న నిర్వహించాల్సిన పరీక్షను వరదల కారణంగా నిర్వహించలేకపోయారు. దీంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్ధులు అందర్నీ పాస్ చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. గోదావరి ముంపు కారణంగా ఇంటర్‌ పరీక్షలు రాయలేకపోయిన 270మంది విద్యార్ధులకు ఈ ఏడాది పరీక్ష నుంచి మినహాయింపునివ్వాలని నిర్ణయించారు. ఆగస్టు 10న 270మంది విద్యార్ధులు కామర్స్‌, కెమిస్ట్రీ, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్‌, మ్యూజిక్ పరీక్షలను రాయలేకపోయారు. పరీక్షలు ముగిసిన తర్వాత కూడా వరదలు కొనసాగడంతో వెంటనే నిర్వ‌హించ‌డం వీలుకాలేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 10న జరగాల్సిన పరీక్షను తిరిగి నిర్వహించాలా, పాస్‌ మార్కులతో ఉత్తీర్ణుల‌ను చేయాలా అని విద్యార్ధుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మంది విద్యార్ధులు కనీస మార్కులతో ఉత్తీర్ణులు కావడానికి మొగ్గు చూపడంతో ఆ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.

రెండేళ్ల త‌ర్వాత ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌...

వరుసగా రెండేళ్ల పాటు కోవిడ్ కారణంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరగలేదు. ఈ ఏడాది మే 6నుంచి 25వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 8.69 లక్షల మంది రెగ్యులర్ విద్యార్ధులు, 72,299 మంది ఒకేషనల్ విద్యార్ధులు పరీక్షలు రాశారు. అన్ని విభాగాల్లో కలిపి 9.41లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో మొదటి సంవత్సరం విద్యార్ధుల్లో 54శాతం, రెండో సంవత్సరంలో 61శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.

First Published:  28 Aug 2022 4:09 AM GMT
Next Story