Telugu Global
Andhra Pradesh

జగన్ మళ్లీ గెలిస్తే ప్రజలు వలస పోవాల్సిందే: బాలకృష్ణ

రాష్ట్రమంతటా ల్యాండ్, శాండ్‌ మాఫియా రెచ్చిపోతోందన్నారు బాలయ్య. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారన్నారు.

Balakrishna: జగన్ మళ్లీ గెలిస్తే ప్రజలు వలస పోవాల్సిందే: బాలకృష్ణ
X

Balakrishna: జగన్ మళ్లీ గెలిస్తే ప్రజలు వలస పోవాల్సిందే: బాలకృష్ణ

ఓవైపు వైసీపీ `జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్` అంటూ కార్యక్రమాలు చేపడుతోంది. మరోవైపు టీడీపీ మాత్రం సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటోంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. సైకో పాలన మళ్లీ రాకూడదని అంటున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే జనం రాష్ట్రం వదిలి పారిపోవాల్సిందేనని హెచ్చరించారు. అనంతపురం జిల్లా శింగనమలలో నారా లోకేష్ తో కలసి యువగళం పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. పాదయాత్ర అద్భుతంగా సాగుతోందని, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ ముందుకెళ్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు లోకేష్ కి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.

జగన్ పాలనలో ఏపీ సర్వనాశనమైందని విమర్శించారు బాలయ్య. అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రమంతటా ల్యాండ్, శాండ్‌ మాఫియా రెచ్చిపోతోందన్నారు బాలయ్య. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదని, చెత్తపైనా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉందన్నారు.

టచ్ లో ఉన్నారు..

ఇటీవల కాలంలో `టచ్ లో ఉన్నారు` అనే పదం బాగా పాపులర్ అయింది. బాలకృష్ణ కూడా ఇప్పుడు దీన్నే పాపులర్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అంటున్నారు బాలయ్య. వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందన్నారు, చాలా మంది టీడీపీతో టచ్‌ లో ఉన్నారని చెప్పారు. వారంతా టీడీపీలో చేరి ప్రజాసేవ చేద్దామని అనుకుంటున్నారని వివరించారు. సీఎం జగన్ కు పబ్‌ జీ ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదన్నారు. వైసీపీ ఓటమి అంచుల్లో ఉందని, ఆ విషయం జగన్ కి కూడా తెలుసన్నారు బాలకృష్ణ.

First Published:  7 April 2023 5:26 AM GMT
Next Story