Telugu Global
Andhra Pradesh

పెన్షన్లు.. ప్రభుత్వ విధానం నిర్ణయం – మేం జోక్యం చేసుకోలేం: తేల్చేసిన ఏపీ హైకోర్టు

పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని అందులో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు తేల్చేసింది.

పెన్షన్లు.. ప్రభుత్వ విధానం నిర్ణయం – మేం జోక్యం చేసుకోలేం: తేల్చేసిన ఏపీ హైకోర్టు
X

పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని అందులో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు తేల్చేసింది. ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న వ్యవహారాల్లో నిర్దిష్టంగా ఫలానా విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవని హాట్‌ కామెంట్స్‌ చేసింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టంగా చెప్పిందని తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ప్రభుత్వం పెన్షన్‌ చెల్లించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్‌ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌ రావులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల విధానాన్ని ఏపీ హైకోర్టు సమర్థించింది.

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పేరుతో పింఛన్‌ అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రభుత్వం 2019 డిసెంబర్‌లో జీవో 174 విడుదల చేసింది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ పెన్షన్ల చెల్లింపుల విషయంలో కొన్ని నిబంధనలు తెచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్‌ 2022లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కౌంటర్లు దాఖలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సెర్ప్‌ సీఈవో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తరువాతే బహుళ పెన్షన్ల విషయంలో నిబంధనలు రూపొందించిందని ప్రభుత్వం తరపున న్యాయవాది వడ్లమూడి కిరణ్‌ కుమార్‌ హైకోర్టుకు తెలిపారు. పింఛన్లకు కేంద్రం రూ.288 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.19,161 కోట్లు చెల్లిస్తోందని వెల్లడించారు. ఈ గణాంకాలను చూసిన తరువాత జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలేదన్న పిటిషనర్‌ వాదనను తాము ఏమాత్రం అంగీకరించడం లేదని హైకోర్టు పేర్కొంది. అశ్వనీకుమార్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో వృద్ధులకు ఆర్థిక సాయం, పెన్షన్లు, నివాసం, వైద్య ఖర్చుల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చిందని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది.

వృద్ధుల దయనీయ పరిస్థితిని సానుభూతి కోణంలో పరిశీలించి పెన్షన్‌ ఇవ్వటాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని ఈ సందర్భంగా తెలిపింది. అయితే పెన్షన్‌ మంజూరు పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్న నిధులు, ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పిందని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. అందువల్ల పెన్షన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయాల్లో తాము ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. దాన్ని పూర్తిగా ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నామని స్పష్టం చేసింది.

First Published:  14 Nov 2023 5:47 AM GMT
Next Story