Telugu Global
Andhra Pradesh

బిగ్ బాస్ కి బిగ్ షాక్.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

బిగ్ బాస్ లో అశ్లీలత ఉంటుందనేది వాస్తవం. కార్యక్రమం ప్రసారానికి ముందు సెన్సార్ చేయలేరనేది కూడా వాస్తవం. ఈ లొసుగుని అడ్డు పెట్టుకునే బిగ్ బాస్ ప్రసారం విషయంలో టీవీ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది.

బిగ్ బాస్ కి బిగ్ షాక్.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
X

బిగ్ బాస్ రియాల్టీ షో విషయంలో మరోసారి చర్చ మొదలైంది. గతంలో వేసిన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు విచారణకు రాగా ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ షో ప్రసారం కావట్లేదని, దీనిపై విచారణ అర్థం లేదని.. ఎండేమోల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇకముందు ప్రసారం కాబోయే కార్యక్రమంపై అభ్యంతరం ఉంటే తాజాగా పిల్‌ వేయడానికి పిటిషనర్‌ కు స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు.

స్టార్‌ ఇండియా మాటీవీ తరపు న్యాయవాదులు కూడా ఇప్పుడు సెన్సార్షిప్ వివాదం ఎందుకన్నారు. కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ చట్టం ప్రకారం ప్రసారానికి ముందే సెన్సార్ షిప్ కి అవకాశం లేదని, సెన్సార్ కావాలంటే కేంద్రం ప్రత్యేకంగా చట్టం చేయాల్సిందేనన్నారు. బిగ్‌ బాస్‌ లాంటి షో నచ్చకపోతే టీవీ ఛానల్‌ మార్చుకోవచ్చని పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ హక్కును నిరాకరించడానికి వీల్లేదని, అందువల్ల న్యాయస్థానం జోక్యం చేసుకునే పరిధి తక్కువ అని వివరించారు.

అది పోస్ట్ మార్టం కాదా..?

బిగ్ బాస్ లో అశ్లీలత ఉంటుందనేది వాస్తవం. కార్యక్రమం ప్రసారానికి ముందు సెన్సార్ చేయలేరనేది కూడా వాస్తవం. ఈ లొసుగుని అడ్డు పెట్టుకునే బిగ్ బాస్ ప్రసారం విషయంలో టీవీ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ప్రసారం తర్వాత అభ్యంతరకర సన్నివేశాలుంటే చట్టప్రకారం ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ ఫిర్యాదు వ్యవహారం తేలినా, తేలకపోయినా.. ఇక్కడ ప్రసారం మాత్రం ఆగదు. ఇలాంటి సందర్భాల్లో ప్రసారానికి ముందే సెన్సార్ షిప్ చేయకపోతే ఎలా అనిప్రశ్నించింది ఏపీ హైకోర్టు. ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ అందే ఫిర్యాదులను పరిశీలించడం ‘పోస్టుమార్టం’ చేయడం లాంటిదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం బిగ్ బాస్ షో ప్రసారం కావడం లేదన్నంత మాత్రాన కోర్టు కళ్లు మూసుకుని ఉండలేదని పేర్కొంది. కేంద్రానికి తగిన సూచనలు ఇస్తామన్నది. పిల్లి మెడలో గంట ఎవరు కడతారనేదే ఇక్కడ ప్రధాన విషయం అని వ్యాఖ్యానించింది.

పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌, స్టార్‌ ఇండియా మాటీవీ, ఎండేమోల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌, సినీ హీరో అక్కినేని నాగార్జునకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

First Published:  27 July 2023 2:11 AM GMT
Next Story