Telugu Global
Andhra Pradesh

నవయుగకు ఎదురుదెబ్బ

మచిలీపట్నం పోర్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం అడుగులు ముందుకేయకుండా నియంత్రించాలంటూ నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

నవయుగకు ఎదురుదెబ్బ
X

బందరు పోర్టు విషయంలో నవయుగ సంస్థకు చుక్కెదురైంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం అడుగులు ముందుకేయకుండా నియంత్రించాలంటూ నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పోర్టు నిర్మాణ పనులు ఇతర కంపెనీలకు అప్పగించకుండా అడ్డుకోవాలని కోరగా హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు.

ఇప్పటికే పోర్టు నిర్మాణం విషయంలో నవయుగ సంస్థతో చేసుకున్న ఒప్పందం రద్దును సమర్థిస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు అమలును నిలిపివేయాలన్న పిటిషన్‌ను కూడా హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే కొత్త సంస్థలతో టెండర్లు ఖరారు అయినందున ఈ దశలో ప్రభుత్వాన్ని నియంత్రించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం సహకరించినా నవయుగ సంస్థే కొత్త షరతులు పెడుతూ పోర్టు నిర్మాణం చేపట్టకుండా జాప్యం చేసినట్టు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విడతల వారీగా భూమిని అప్పగించేందుకు ముందుకొచ్చినా మొత్తం 5,324 ఎకరాలు ఒకేసారి ఇవ్వాలంటూ పట్టుబ‌ట్టడం ద్వారా పోర్టు నిర్మాణం చేయకుండా నవయుగ సంస్థ జాప్యం చేసిందని కోర్టు వ్యాఖ్యానించింది.

హైకోర్టు నవయుగ పిటిషన్లను తిరస్కరించిన నేపథ్యంలో పోర్టు నిర్మాణానికి మార్గం క్లియర్ అయింది. వచ్చే నెలలో సీఎం జగన్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.

First Published:  30 Sep 2022 4:36 AM GMT
Next Story