Telugu Global
Andhra Pradesh

వర్శిటీ పోస్ట్ ల భర్తీకి సై.. మరి డీఎస్సీ సంగతేంటి..?

ఇప్పటికే యూనివర్శిటీలు, ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కొత్త నోటిఫికేషన్లో గ్రేస్ మార్క్ లు ఇవ్వబోతున్నారు. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్ఠంగా 10 మార్కులు వెయిటేజ్‌ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు.

వర్శిటీ పోస్ట్ ల భర్తీకి సై.. మరి డీఎస్సీ సంగతేంటి..?
X

ఏపీలో యూనివర్శిటీ ప్రొఫెసర్లు, ట్రిపుల్ ఐటీల్లో ఫ్యాకల్టీ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు సీఎం జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యపై జరిగిన సమీక్షలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. యూనివర్శిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టులు, ట్రిపుల్‌ ఐటీల్లో 660 పోస్టులు భర్తీ చేస్తారు. నవంబరు 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్

ఇప్పటికే యూనివర్శిటీలు, ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కొత్త నోటిఫికేషన్లో గ్రేస్ మార్క్ లు ఇవ్వబోతున్నారు. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్ఠంగా 10 మార్కులు వెయిటేజ్‌ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. ఇంటర్వ్యూ దశలో ఈ వెయిటేజ్‌ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. సిబ్బంది నియామకాల్లో అర్హత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సీఎం జగన్ ఆదేశించారు. సెప్టెంబర్ నెలాఖరులోగా ఏపీపీఎస్సీ ద్వారా ఆయా పోస్ట్ లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

డీఎస్సీ ఎప్పుడు..?

ఏపీలో నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న డీఎస్సీ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా త్వరలో డీఎస్సీ అని చెప్పేవారు విద్యాశాఖ మంత్రులు. ఆ శాఖకు ఇద్దరు మంత్రులు మారారే కానీ ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకపోవడం విశేషం. అయితే ఎన్నికల ఏడాదిలో అయినా మెగా డీఎస్సీ వస్తుందేమోనని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రేషనలైజేషన్ ప్రకారం ఉన్న స్కూళ్ల సంఖ్య తగ్గిపోతున్న ఈ దశలో డీఎస్సీలో భారీగా ఉపాధ్యాయుల పోస్ట్ ల భర్తీ జరగకపోవచ్చు.

First Published:  3 Aug 2023 2:44 PM GMT
Next Story