Telugu Global
Andhra Pradesh

గ్రూప్-2 ప‌రీక్ష విధానంలో మార్పులు.. - ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు

గ‌తంలో మెయిన్స్‌లో పేప‌ర్‌-1లో ఉన్న జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌ను ర‌ద్దు చేసి దానిని స్క్రీనింగ్ టెస్టులోకి మార్చారు. ఈ టెస్టును గ‌తంలో మాదిరిగానే 150 మార్కుల‌కే నిర్వ‌హిస్తారు.

గ్రూప్-2 ప‌రీక్ష విధానంలో మార్పులు.. - ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు
X

గ్రూప్‌-2 ప‌రీక్ష విధానంలో మార్పులు చేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మెయిన్స్ పేప‌ర్ల‌ను మూడు నుంచి రెండుకు కుదించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం జీవో-6ను విడుద‌ల చేసింది. ప‌రీక్ష విధానం, సిల‌బ‌స్‌పై నిపుణుల క‌మిటీ ఇచ్చిన నివేదిక ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపింది. ప్ర‌భుత్వం వాటిని ఆమోదిస్తూ తాజా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

గ‌తంలో గ్రూప్‌-2 స్క్రీనింగ్ టెస్టును 150 మార్కుల‌కు నిర్వ‌హించేవారు. మెయిన్స్‌లో పేప‌ర్‌-1 జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌గా ఉండేది. దాంతో పాటు మ‌రో రెండు పేప‌ర్లు కూడా ఉండేవి. పేప‌ర్‌కు 150 మార్కులు చొప్పున మొత్తం 3 పేప‌ర్ల‌కూ క‌లిపి 450 మార్కుల‌కు మెయిన్స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేవారు. ఈసారి నుంచి ఈ విధానంలో మార్పులు చేశారు.

గ‌తంలో మెయిన్స్‌లో పేప‌ర్‌-1లో ఉన్న జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌ను ర‌ద్దు చేసి దానిని స్క్రీనింగ్ టెస్టులోకి మార్చారు. ఈ టెస్టును గ‌తంలో మాదిరిగానే 150 మార్కుల‌కే నిర్వ‌హిస్తారు. మెయిన్స్‌లో ఇక‌పై రెండు పేప‌ర్లు ఉంటాయి. వాటిని ఒక్కొక్క పేప‌రుకు 150 మార్కులు చొప్పున మొత్తం 300 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఈ నేప‌థ్యంలో మెయిన్స్ సిల‌బ‌స్‌లోనూ మార్పులు చేశారు.

కొత్త విధానం ప్ర‌కారం సిల‌బ‌స్ ఇలా ..

స్క్రీనింగ్ టెస్టులో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్, మెంట‌ల్ ఎబిలిటీ ఉంటాయి. వీటికి 150 మార్కులు ఉంటాయి.

మెయిన్స్ పేప‌ర్‌-1లో సోష‌ల్ హిస్ట‌రీ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ (ఏపీ సామాజిక చ‌రిత్ర‌, సాంస్కృతోద్య‌మాలు),

జ‌న‌ర‌ల్ ఓవ‌ర్ వ్యూ ఆఫ్ ది ఇండియ‌న్ కాన్‌స్టిట్యూష‌న్ సిల‌బ‌స్‌గా ఉంటాయి. ఈ పేప‌ర్‌కు 150 మార్కులు ఉంటాయి.

మెయిన్స్ పేప‌ర్‌-2లో ఇండియ‌న్ ఎకాన‌మీ అండ్ ఏపీ ఎకాన‌మీ, సైన్స్ అండ్ టెక్నాల‌జీ సిల‌బ‌స్‌గా ఉంటాయి. ఈ పేప‌ర్‌కు కూడా 150 మార్కులు ఉంటాయి.

First Published:  7 Jan 2023 2:54 AM GMT
Next Story