Telugu Global
Andhra Pradesh

ఈనాడుపై పరువు నష్టం దావాకు జగన్ ఆదేశం

రోజూ ఈనాడులో ఆరోపణలతో కథనాలు రావడం, తర్వాతి రోజు సాక్షిలో ఖండనలు రావడం.. ఇటీవల కాలంలో సహజంగా మారింది. అయితే ఇప్పుడు పరువు నష్టం దావాతో ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసినట్టయింది.

ఈనాడుపై పరువు నష్టం దావాకు జగన్ ఆదేశం
X

ఈనాడు పత్రికపై పరువు నష్టం దావా వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనాడుపై ప్రాసిక్యూషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్ట్‌ పై తప్పుడు కథనాలు ప్రచురించారంటూ పరువు నష్టం దావా వేయాలని ఆదేశించింది. మే 12న పోలవరంపై ఈనాడు పత్రికలో వచ్చిన కథనాలు పూర్తిగా నిరాధారంగా ఉన్నాయనేది ప్రభుత్వ వాదన. ఈ కథనాలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఈనాడు ఎండీ, జర్నలిస్టులపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్ ఆఫ్‌ డెఫమేషన్‌ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.

ఈనాడు వార్తలపై ఇప్పటి వరకూ సాక్షిలో కౌంటర్ వార్తలు ఇస్తున్నారు కానీ, ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోలేదు. ఇటీవల వైజాగ్ బస్ బే కూలిపోయిందంటూ వచ్చిన వార్తలపై కూడా వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తప్పుడు కథనాలంటూ మండిపడ్డారు. రోజూ ఈనాడులో ఆరోపణలతో కథనాలు రావడం, తర్వాతి రోజు సాక్షిలో ఖండనలు రావడం.. ఇటీవల కాలంలో సహజంగా మారింది. అయితే ఇప్పుడు పరువు నష్టం దావాతో ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసినట్టయింది.

పవన్ పై దావా ఏమయింది..?

ఆ మధ్య వాలంటీర్లను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ పేరిట ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. 1973 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం పవన్ కల్యాణ్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. మహిళా కమిషన్ నుంచి కూడా పవన్ కి నోటీసులు పంపించింది. ఆ తర్వాత అప్డేట్ ఏంటనేది ఇంకా తేలలేదు. ఇప్పుడు ఈనాడు కథనాలను మాత్రం ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. యాజమాన్యంతోపాటు, జర్నలిస్ట్ లను కూడా కోర్టుమెట్లెక్కించేందుకు సిద్ధమైంది.

First Published:  29 Aug 2023 12:38 PM GMT
Next Story