Telugu Global
Andhra Pradesh

జ‌నం సొమ్ము కాజేసినందుకు చంద్రబాబు అరెస్ట్‌.. - సజ్జల

ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదని, దాదాపు రెండేళ్ల కిందటే ఎఫ్‌ఆఐర్‌ నమోదైంద‌ని స‌జ్జ‌ల‌ వివ‌రించారు. 2021 డిసెంబర్‌లో (9-12-2021) సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని తెలిపారు.

జ‌నం సొమ్ము కాజేసినందుకు చంద్రబాబు అరెస్ట్‌.. - సజ్జల
X

జ‌నం సొమ్ము కాజేసిన కేసులోనే చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశార‌ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు. తాడేప‌ల్లిలోని పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న స్కామ్‌ వివ‌రాలు వెల్ల‌డించారు. చంద్రబాబు అరెస్టులో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆయ‌న‌ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌లో ఎలాంటి దురుద్దేశాలూ లేవని, బలమైన ఆధారాలతోనే సిట్ వేశామని ఆయ‌న చెప్పారు. సీఎం జ‌గ‌న్ ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందని తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్ఛ‌గా దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు.

స్కీమ్ పేరుతో స్కామ్ చేశారు..

స్వ‌తంత్ర‌ భారత దేశంలో అత్యంత హేయమైనది ఆర్థిక నేరమని.. స్కీమ్‌ పేరుతో స్కామ్‌ చేశారని ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల విమర్శించారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కాంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్‌ అయ్యాక, రాజకీయ దురుద్దేశాలతోనే తనను అరెస్ట్‌ చేశారంటూ వ్యాఖ్యానించారని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ లేదు.. నోటీసులు లేదని టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోంద‌ని, అన్నీ తెలిసే రెండు మూడు రోజుల నుంచి అరెస్ట్‌ గురించి చంద్ర‌బాబు మాట్లాడుతున్నారని సజ్జల గుర్తుచేశారు. ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదంటూ దబాయిస్తున్నారని, రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. కానీ, ఈ కేసు చాలా బలంగా ఉందని తెలిపారు.

రెండేళ్ల కింద‌టే ఎఫ్ఐఆర్ న‌మోదు..

ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదని, దాదాపు రెండేళ్ల కిందటే ఎఫ్‌ఆఐర్‌ నమోదైంద‌ని స‌జ్జ‌ల‌ వివ‌రించారు. 2021 డిసెంబర్‌లో (9-12-2021) సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని తెలిపారు. కానీ.. 2017-18లోనే జీఎస్టీ డీఐజీ నేతృత్వంలోని బృందం రూ.241 కోట్లు డైవర్ట్‌ అయ్యిందని బయటపెట్టిందని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ కంటే ముందే జీఎస్టీ నిఘాలో ఈ స్కామ్‌ బయటపడిందని సజ్జల తెలిపారు. స్కాంలో అప్పటి సీఎం పాత్ర ఉందనే బలమైన సాక్ష్యాలు సీఐడీ దగ్గర ఉన్నాయని వివ‌రించారు. షెల్‌ కంపెనీల ద్వారా నిధులు తరలించారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఎఫ్‌ఐఆర్‌కు ముందే స్కామ్‌ బయటపడిందని, తేదీ లేని ఎంవోయూ కుదర్చుకున్నారని, జీవో ప్రకారం ఏదీ జరగలేదని, అన్నీ పక్కకు పెట్టారని సజ్జల వివరించారు. ఎంవోయూ అయ్యాక ఉన్నతాధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారని, నోట్‌ఫైల్స్‌లో కూడా అధికారులు ఇదే విషయాన్ని ప్రస్తావించారని అన్నారు. డిజైన్ టెక్‌ ద్వారా హవాలా డబ్బు టీడీపీ వాళ్ల ఖాతాల్లోకి వెళ్లిందని సీఐడీ గుర్తించిందని, చంద్రబాబు ఆదేశాల ప్రకారమే స్కాం జరిగిందని గుర్తించి ఆధారాలు చూపించి మరీ సీఐడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. 2018లోనే విజిల్‌ బ్లోయర్‌ ద్వారా స్కామ్‌ బయటపడిందని చెప్పారు.

జ‌రుగుతున్న‌ది ద‌ర్యాప్తే.. రాజ‌కీయాలు కాదు..

ఆరోపణలున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం సాధారణమని, రెండేళ్లుగా సాగుతున్న దర్యాప్తు కేసులో ఇప్పుడు కూడా చంద్రబాబును ప్రశ్నించకపోతే ఎలా? అని స‌జ్జ‌ల ప్ర‌శ్నించారు. స్కామ్‌లో దర్యాప్తే జరుగుతోంది.. రాజకీయాలు కాదు అని ఆయ‌న‌ స్ఫష్టం చేశారు. రాజకీయ దురుద్దేశమే ఉంటే అరెస్ట్‌కు ఇన్ని రోజులు ఎందుకు సమయం పడుతుందని ఆయ‌న ప్ర‌శ్నించారు. డబ్బు ఎటు నుంచి ఎటు వెళ్లిందనేది తేలడానికి టైం పట్టిందని సజ్జల వివరించారు. బెనిఫీషియరీ కూడా చంద్రబాబే అని తేలడంతో అరెస్ట్‌ చేశారని తెలిపారు. చంద్రబాబుని కరుణానిధిని అరెస్ట్‌ చేసినట్లు అర్ధరాత్రి ఏమీ అరెస్ట్‌ చేయలేదని, పగటి పూటే ప్రోటోకాల్ ప్రకారమే పకడ్బందీగా ప్లాన్‌ చేసిన స్కామ్‌ కేసులోనే చంద్రబాబు అరెస్ట్‌ అయ్యార‌ని సజ్జల రామ‌కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు.

First Published:  9 Sep 2023 7:53 AM GMT
Next Story