Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఒక రాజకీయ నటుడు - సజ్జల

వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని, పోలీసు యాక్ట్‌కు లోబడే ప్రభుత్వం జీవో తీసుకువచ్చిందనీ, ఈ నిర్ణయం అన్ని పార్టీలకూ వర్తిస్తుందని స‌జ్జ‌ల‌ స్పష్టం చేశారు.

చంద్రబాబు ఒక రాజకీయ నటుడు - సజ్జల
X

కందుకూరు, గుంటూరులో 11 మంది అమాయకుల మ‌ర‌ణాల‌కు చంద్రబాబు బాధ్యత వహించాలని ఏపీ ప్ర‌భుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఒక రాజకీయ నటుడు అని విమర్శించారు. కందుకూరులో నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు బలయ్యేవారు కాదన్నారు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు కనీస సంస్కారం లేదని ఆరోపించారు. చంద్రబాబుని జనం పట్టించుకోవడం మానేశారు కాబట్టి రోజుకో రకంగా పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని, పోలీసు యాక్ట్‌కు లోబడే ప్రభుత్వం జీవో తీసుకువచ్చిందనీ, ఈ నిర్ణయం అన్ని పార్టీలకూ వర్తిస్తుందని స‌జ్జ‌ల‌ స్పష్టం చేశారు. ఈ జీవోను ఉల్లంఘిస్తామని టీడీపీ ఛాలెంజ్‌ చేస్తోంది.. చట్టాన్ని ఉల్లంఘించడం సబబు కాదని ఆయన హితవుపలికారు. కుప్పానికి చంద్రబాబు దండయాత్రలా బయల్దేరారు. సభలు పెట్టుకోవద్దని చంద్రబాబుకు ఎవరూ చెప్పలేదన్నారు. ఇరుకైన ప్రాంతాల్లో మాత్రమే సభలు వద్దని, కుప్పంలో చంద్రబాబుకు పోలీసులు సూచించారని తెలిపారు. చంద్రబాబు పోలీసుల పట్ల బెదిరింపు ధోరణికి దిగటాన్ని తప్పుపట్టారు.

నిన్న కుప్పం ఆసుపత్రిలో కొందరు బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు కార్యక్రమాన్ని ఎండగట్టారు సజ్జల. 40 ఏండ్లుగా రాజకీయం చేస్తున్న చంద్రబాబు.. పరామర్శ నిజం అని నమ్మించలేక పోయాడన్నారు. దానికి సంబంధించిన ఫొటో చూపించిన స‌జ్జ‌ల‌.. ఆసుపత్రిలో ముందుగానే పబ్లిసిటీకి బాబు ప్లాన్ చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి ఆలోచనలు రామోజీరావు, రాధాకృష్ణ ఇస్తున్నారేమో అని విమర్శించారు.

కుప్పంలో జరిగింది ఏంటి?.. టీడీపీ నేతలు వాట్సాప్‌ ద్వారా ఓ మెసేజ్‌ డీఎస్పీకి పంపించారు.. సెక్షన్‌ 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉంది.. ముందు ఇన్‌ఫాం చేయాలి.. మీరు సభ ఎక్కడ పెడతారో చెబితే మేం అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పారు. ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి తీసుకోవాలని డీఎస్పీ మెసెజ్‌ చేస్తే ఎందుకు రిప్ల‌య్ ఇవ్వడం లేదని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్రశ్నించారు. చట్టానికి కట్టుబడి ఉంటారా? వెలుపల ఉంటారా? వెలుపల ఉంటానంటే పోలీసులు అడ్డుకుంటారని స్పష్టం చేశారు. కుప్పంలో చంద్రబాబు పోలీసు అధికారిపై వేలు చూపిస్తూ దబాయించారని, ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని డీఎస్పీ ఎంతో మర్యాదగా మాట్లాడారని వివరించారు. మైక్‌ పర్మిషన్‌ లేకపోవడంతో వాహనాన్ని తీసుకెళ్లారని, చంద్రబాబు ఇష్టారాజ్యంగా చేస్తే ఊరుకోవాలా? చంద్రబాబు హుంకారాలు దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రజలు గమనించాలని సజ్జల విన్నవించారు.

First Published:  6 Jan 2023 1:45 PM GMT
Next Story