Telugu Global
Andhra Pradesh

రేణుకా చౌదరీ.. మీవాళ్లది మాత్రమే త్యాగమా?

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎన్నడూ మాట్లాడని రేణుకాచౌదరి ఇప్పుడు మాత్రం అమరావతిలో తన వారి భూముల విలువ పెరగాలన్న తపనతో ఇక్కడికి వచ్చారని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు.

రేణుకా చౌదరీ.. మీవాళ్లది మాత్రమే త్యాగమా?
X

అమరావతి కోసం లక్షల మంది పోరాటం చేస్తున్నట్టుగా చిత్రీకరించి, నమ్మించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే జాలేస్తోందన్నారు మాజీ మంత్రి కన్నబాబు. టెంట్‌లో పది మంది లేకున్నా వెయ్యి రోజులుగా ఏదో పెద్ద ఉద్యమం అన్నట్టుగా ఎల్లో మీడియా చూపిస్తోందన్నారు. కేవలం చంద్రబాబు, ఆయన మనుషుల రియల్ ఎస్టేట్‌ వ్యాపారం కోసం కాకుండా మరెందుకు ఈ తపన అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు రాజకీయం, రియల్ ఎస్టేట్‌ తప్ప మరేది కనిపించడం లేదన్నారు. అమరావతిలో తమ పెట్టుబడి పది రెట్లు పెరగలేదని, అమరావతి లేకుంటే రాష్ట్రమే లేదన్నట్టుగా చంద్ర‌బాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రానికి చెందిన రేణుకా చౌదరి ఇక్కడి వచ్చి.. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిని నీచంగా తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎన్నడూ మాట్లాడని రేణుకాచౌదరి ఇప్పుడు మాత్రం అమరావతిలో తన వారి భూముల విలువ పెరగాలన్న తపనతో ఇక్కడికి వచ్చారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఆత్మగౌరవం ఉండదా అని ప్రశ్నించారు. అమరావతికి చంద్రబాబు చేసిన మంచేంటి, జగన్ చేసిన నష్టమేంటో చెప్పాలన్నారు. రేణుకా చౌదరి దృష్టిలో అమరావతి రైతులది మాత్రమే త్యాగమా ? పోలవరం ముంపు ప్రాంతాల వారిది త్యాగం కాదా అని ప్రశ్నించారు. వారి పక్షాన కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదని రేణుకా చౌదరిని ప్రశ్నించారు.

చంద్రబాబుకు ఉన్న ఒకే ఒక్క అదృష్టం మీడియా బలం అన్నారు కన్నబాబు. చంద్రబాబు లేస్తే మనిషి కాదని రోజూ ఈ మీడియా ప్రచారం చేస్తుంటుందని ఎద్దేవా చేశారు. అమరావతిపై టీడీపీ మీడియా ప్రచారం చూస్తుంటే పిచ్చెక్కిపోతోందన్నారు.

First Published:  12 Sep 2022 1:58 PM GMT
Next Story