Telugu Global
Andhra Pradesh

విద్యాశాఖపై జగన్ సమీక్ష.. వచ్చే ఏడాది నుంచి డిజిటల్ బోధన

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి IFP ప్యానెల్స్‌ ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దన్నారు. డిజిటల్‌ స్క్రీన్ల వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలని చెప్పారు.

విద్యాశాఖపై జగన్ సమీక్ష.. వచ్చే ఏడాది నుంచి డిజిటల్ బోధన
X

ఏపీలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రావాలని చూస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ ల పంపిణీ పూర్తయింది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇచ్చారు. వాటి పనితీరుపై నిరంతరం పరిశీలన ఉండాలని, అదే సమయంలో విద్యార్థులు వాటి ద్వారా ఏమేరకు పాఠ్యాంశాలను నేర్చుకుంటున్నారనే విషయం హెడ్మాస్టర్, ఎంఈవోలు పరిశీలించాలన్నారు. ట్యాబ్ ల రిపేర్ కోసం నియోజకవర్గంలో ఒక సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. వారం రోజుల్లో రిపేర్ చేసివ్వాలని, లేకపోతే కొత్త ట్యాబ్ తో రీప్లేస్ చేయాలని సూచించారు.

వచ్చే ఏడాది డిజిటల్ స్క్రీన్లు..

ఇక ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటుకోసం విద్యాశాఖ కసరత్తులు మొదలు పెట్టింది. తరగతి గదుల డిజిటలైజేషన్‌ లో భాగంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (IFP) ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం జగన్ కు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి IFP ప్యానెల్స్‌ ఏర్పాటు కావాలని సీఎం ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దన్నారు. డిజిటల్‌ స్క్రీన్ల వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలని చెప్పారు.

పిల్లలందరి వద్ద డిక్షనరీలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం విద్యా కానుక కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యా కానుక అందాలన్నారు. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలని, డీఎస్సీ- 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. గోరుముద్ద నాణ్యతను నిరంతర పరిశీలించాలని ఆదేశించారు. ఇప్పుడిస్తున్న ఆహారానికి అదనంగా స్కూలు పిల్లలకు బెల్లంతో రాగి మాల్ట్‌ ఇవ్వాలని చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి రాగిమాల్ట్‌ సరఫరా చేయాలని ఆదేశించారు సీఎం జగన్.

First Published:  5 Jan 2023 3:24 PM GMT
Next Story