Telugu Global
Andhra Pradesh

వలంటీర్లకు జగన్ వరాలు?

వ‌లంటీర్లు చేస్తున్న సేవలు, పడుతున్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని జీతాలు పెంచాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇప్పుడిస్తున్న జీతం రూ.5 వేలను రూ. 10 వేలకు పెంచాలని నిర్ణయించారట.

వలంటీర్లకు జగన్ వరాలు?
X

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా నిలుస్తున్న బలమైన వ్యవస్థ వ‌లంటీర్లకు జీతాలు పెంచే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. 2019 అక్టోబర్ 2వ తేదీన పురుడుపోసుకున్న వలంటీర్ వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రంలో బలంగా పాతుకుపోయింది. రెండున్నల లక్షల మంది వలంటీర్లు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ల‌బ్ధిదారుల‌కు సక్రమంగా అందటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సుమారు 530 సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్ర‌జ‌లకు అందిస్తున్నారు.

ప్రతి 50 ఇళ్ళకు ఒక వలంటీర్‌ను నియమించిన కారణంగా ఏ ఇళ్ళకు ప్రభుత్వ సేవలు అందుతున్నది లేనిది వలంటీర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రతి వలంటీర్‌కు ప్రభుత్వం ఇప్పుడు రూ. 5 వేలు గౌరవ వేతనం ఇస్తోంది. తమ వేతనాన్ని పెంచాలని వలంటీర్లు ఎప్పటినుండో అడుగుతున్నారు. వలంటీర్ల వ్యవస్థ‌తో పాటు ఏర్పడిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేయటంతో పాటు జీతం రూ. 25 వేలకు పెంచారు. అప్పటి నుండి తమకూ జీతాలు పెంచాలని వలంటీర్లు అడుగుతున్నారు.

వ‌లంటీర్లు చేస్తున్న సేవలు, పడుతున్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని జీతాలు పెంచాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇప్పుడిస్తున్న జీతం రూ.5 వేలను రూ. 10 వేలకు పెంచాలని నిర్ణయించారట. బహుశా డిసెంబర్ 21వ తేదీ నుండి అమలయ్యే అవకాశముందని సమాచారం. ఎందుకంటే డిసెంబర్ 21వ తేదీ జగన్ పుట్టినరోజు కాబట్టి. ఉన్న ఊరిలో లేదా ఉన్న చోటే నెలకు 10 వేల రూపాయలు వస్తున్నదంటే అంతకన్నా కావాల్సిందేముంటుంది. ఊరికే తిరిగే బదులు, ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చేంతవరకు వలంటీర్‌గా ప‌నిచేయొచ్చు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వలంటీర్లపై ఆరోపణలతో రెచ్చిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. నిరాధారంగా వలంటీర్లపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలతో వాళ్ళు నైతికంగా ఇబ్బందులు పడ్డారు. అలాంటిది ఇప్పుడు జగన్ తీసుకోబోతున్న నిర్ణయంతో కాస్త ఊరట లభిస్తుంది. పనిలోపనిగా వృద్ధాప్య పింఛ‌న్‌ కూడా పెంచే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతకు పెంచాలన్న విషయమై కసరత్తు జరుగుతోందట.

First Published:  3 Aug 2023 4:54 AM GMT
Next Story