Telugu Global
Andhra Pradesh

ఆ విషయంలో మోదీకే నా మద్దతు.. జగన్ క్లారిటీ

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతున్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు సీఎం జగన్. అదే సమయంలో విపక్షాల తీరును తప్పుబట్టారు.

ఆ విషయంలో మోదీకే నా మద్దతు.. జగన్ క్లారిటీ
X

ఈనెల 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రారంభోత్సవ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రపతి చేతులమీదుగా పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని సూచిస్తున్నాయి. కాదని మోదీయే రిబ్బన్ కట్ చేస్తామంటే మాత్రం తాము ఆ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తామంటూ 19 పార్టీలు ఉమ్మడిగా ఓ లేఖ విడుదల చేశాయి. మరి మిగిలిన పార్టీల సంగతేంటి..? ఇప్పటి వరకు చాలా విషయాల్లో ఎన్డీఏ నిర్ణయాలను సమర్థించిన వైసీపీ ఈ ప్రారంభోత్సవానికి వెళ్తుందా..? లేదా..? అనే సందేహాలున్నాయి. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఏపీ సీఎం జగన్ తాజాగా ఓ ట్వీట్ వేశారు.

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతున్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు సీఎం జగన్. అదే సమయంలో విపక్షాల తీరును తప్పుబట్టారు. ఇక్కడ రాజకీయాలు చూడకూడదని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చూడాలని హితవుపలికారు. పార్లమెంటు అనేది ప్రజాస్వామ్య దేవాలయం అని అన్నారు జగన్. అది మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుందని చెప్పారు. పార్లమెంట్ దేశ ప్రజలతోపాటు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినదని ఇలాంటి శుభకార్యాన్ని బహిష్కరించాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పారు.

అందరూ హాజరు కావాలి.

రాజకీయాలు పక్కనపెట్టి అన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు ఏపీ సీఎం జగన్. మిగతా వారి సంగతి పక్కనపెడితే.. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మిక కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుందని క్లారిటీ ఇచ్చారు.

ఆ పార్టీలపై ఎన్డీఏ ఆగ్రహం..

పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాలేమంటూ 19 పార్టీలు లేఖ రాయడాన్ని ఎన్డీఏ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ చర్య వారికి గౌరవాన్నివ్వదని తెలిపింది. ప్రజాస్వామ్య నీతి, రాజ్యంగ విలువలకు అవమానం అని ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్డీఏ. ప్రతిపక్షాల చర్యలను మేధోపరమైన దివాళాగా పేర్కొంది. ప్రజాస్వామ్యానికి ధిక్కారంగా, ద్రోహంగా ప్రజలు పరిగణిస్తారని చెప్పింది.

First Published:  25 May 2023 2:19 AM GMT
Next Story