Telugu Global
Andhra Pradesh

ఆస్తుల అటాచ్‌మెంట్... మరీ ఓవర్‌గా లేదా?

అనుచిత పోస్టులు పెడితే కేసులు పెట్టడం, కోర్టు ద్వారా జైలుకు పంపటం మామూలుగా జరిగేదే. అయితే ఆస్తులను ఎటాచ్ చేసుకుంటామని సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పటంపైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆస్తుల అటాచ్‌మెంట్... మరీ ఓవర్‌గా లేదా?
X

ఆస్తుల అటాచ్‌మెంట్... మరీ ఓవర్‌గా లేదా?

సోషల్ మీడియాలో ఎవరిపైన అయినా అనుచిత పోస్టులు పెడితే వాళ్ళ ఆస్తులను ఎటాచ్ చేస్తామని సీఐడీ చీఫ్ సంజయ్ చేసిన ప్రకటన మరీ ఓవర్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగానే అనుచిత పోస్టులు పెట్టడంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపైన మాత్రమే కాదని, ప్రతిపక్ష నేత, కుటుంబ సభ్యులతో పాటు జడ్జీలు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీలపైన కూడా అనుచిత పోస్టులు పెడితే ఆస్తులను ఎటాచ్ చేస్తామని హెచ్చరించారు.

ఎవరిపైనా ఎవరు కూడా అనుచిత పోస్టులు పెట్టకూడదనటంలో సందేహంలేదు. ఒకవేళ పెడితే కేసులు నమోదు చేయటంలో తప్పులేదు. ఎందుకంటే అనుచిత పోస్టులుపెట్టారన్న కారణంగా చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు కూడా చాలామందిపైన కేసులు పెట్టి జైళ్ళకి పంపించిన ఘటనలున్నాయి. ఇప్పుడు కూడా జగన్+ఆయన కుటుంబ సభ్యులపై అదే పద్ధ‌తిలో చాలా అసభ్యంగా, అభ్యంతరకరంగా పోస్టులు కనబడుతున్నాయి. కాబట్టి యాక్షన్ తీసుకోవద్దని ఎవరు అనేందుకు లేదు.

ఇక్కడ సీఐడీ మంచి నిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే ప్రతిపక్ష నేతలు, వాళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా అనుచిత పోస్టులు పెట్టేందుకు లేదని చెప్పారు. పోస్టులు పెడితే కేసులు పెట్టడం, కోర్టు ద్వారా జైలుకు పంపటం మామూలుగా జరిగేదే. అయితే ఆస్తులను ఎటాచ్ చేసుకుంటామని సంజయ్ చెప్పటంపైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మామలూగా ఆస్తులు అంటేనే కుటుంబం మొత్తానికి సంబంధించినవి అయ్యుంటాయి. కేసులు పెట్టడాన్ని ఎవరు తప్పుపట్టకపోయినా ఆస్తులు ఎటాచ్ చేస్తామనటంపైన తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యక్తి చేసే తప్పుకు కుటుంబం మొత్తానికి సంబంధించిన ఆస్తులను ఎటాచ్ చేయటం ఏమిటని జనాలు అడుగుతున్నారు.

సంజయ్ చేసిన ప్రకటన మరీ ఓవర్‌గా ఉందని జనాలు అనుకుంటున్నారు. అనుచిత పోస్టులు పెట్టడాన్ని నియంత్రించటం అంటే ఆస్తులు ఎటాచ్ చేసుకోవటమేనా అనే ప్ర‌శ్నలు ఎదురవుతున్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అనుచిత పోస్టులను నియంత్రించేందుకు సీఐడీ కేసులు పెడుతునే ఉంది, పోస్టులు కనబడుతునే ఉన్నాయి. రాజకీయంగా ప్రత్యర్థులను గబ్బుపట్టించటమే లక్ష్యంగా పార్టీలు పనిచేస్తున్నంత కాలం ఇలాంటి అనుచిత పోస్టులు తప్పవని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో పార్టీలకు స్ట్రిక్ట్ గా మార్గదర్శకాలు విధిస్తే కాని ఇలాంటి అనుచిత పోస్టులు తగ్గవని జనాలు సూచిస్తున్నారు.

First Published:  9 Nov 2023 6:11 AM GMT
Next Story