Telugu Global
Andhra Pradesh

ఆంధ్రా లీడర్లకు కేసీఆర్ అంటే భయమా..?

2019 ఎన్నికలకు పూర్వం వీరు తెలంగాణ పాలనపై విమర్శలు చేసేవారేమోగానీ.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మరి బీఆర్ఎస్ లోకి ఏపీ సీరియస్ గా అడుగుపెడితే వీరి పరిస్థితి ఏమిటి..?

ఆంధ్రా లీడర్లకు కేసీఆర్ అంటే భయమా..?
X

జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పొరుగు రాష్ట్రం అది కూడా తెలుగు రాష్ట్రమైన ఏపీపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ఓ మాజీ మంత్రి, జనసేనకు చెందిన కొందరు ముఖ్యనేతలు బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాశం అయ్యింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీని తిట్టిపోసిన కేసీఆర్ ను.. అక్కడి ప్రజలు ఆదరిస్తారా..? ఆయన మాటలను ఆలకిస్తారా..? అన్నది వేరే చర్చ గానీ.. ప్రస్తుతం కేసీఆర్ మాత్రం.. బీఆర్ఎస్ విషయంలో కాస్త దూకుడుగానే ఉన్నారు.

కాగా ఈ అంశానికి సంబంధించి ఇవాళ.. బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆంధ్రా ప్రజలను తిట్టిన కేసీఆర్ ఇప్పుడు ఈ ప్రాంతానికి ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. అంతేకాక ఏపీకి చెందిన చంద్రబాబు, సీఎం జగన్ కేసీఆర్ కు భయపడుతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఏపీలో ప్రధానంగా రాజకీయాలు చేసే జగన్, చంద్రబాబు, పవన్ వీరి ముగ్గురికి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. జగన్ తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు. కానీ, చంద్రబాబు మాత్రం ఇక్కడ పోటీ చేయాలని ఉత్సాహ పడుతున్నారు.

మరోవైపు పవన్ కల్యాణ్ కూడా గతంలో తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేస్తానని చెప్పుకున్నారు. అయితే బీఆర్ఎస్ విషయంలో ఇప్పటికే వైసీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఏపీలో ఏ కొత్త రాజకీయపార్టీ వచ్చినా తాము స్వాగతిస్తామని సజ్జల చెప్పేశారు. అయితే బీఆర్ఎస్ విషయంలో టీడీపీ గానీ, జనసేన గానీ నోరు మెదపడం లేదు. అనుకూలంగా వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. నిజానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పటివరకు ఏనాడూ సీఎం కేసీఆర్ ను విమర్శించింది లేదు.

2019 ఎన్నికలకు పూర్వం వీరు తెలంగాణ పాలనపై విమర్శలు చేసేవారేమోగానీ.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మరి బీఆర్ఎస్ లోకి ఏపీ సీరియస్ గా అడుగుపెడితే వీరి పరిస్థితి ఏమిటి..? ఎప్పటిలాగానే వ్యూహాత్మక మౌనం పాటిస్తారా..? అన్నది వేచి చూడాలి. మరోవైపు ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రం.. ఏపీలో వైసీపీకి బీఆర్ఎస్ నిజమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నారు. మొత్తంగా ఏపీ నేతల్లో బీఆర్ఎస్ కొత్త చిచ్చు పెట్టింది. చంద్రబాబు, పవన్ తమ ఆస్తులు, ఇతరత్రా వ్యవహారాలకు భయపడి కేసీఆర్ జోలికి వెళ్లరు. మరి జగన్ వెళతారా..? వేచి చూడాలి.

First Published:  3 Jan 2023 12:42 PM GMT
Next Story