Telugu Global
Andhra Pradesh

రాజధానిపై మాట మార్చిన జేపీ?

మూడు రాజధానుల విషయంలో లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ గతానికి కాస్త భిన్నంగా మాట్లాడారు. గతంలో అసెంబ్లీలో జగన్‌మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణపై ప్రకటన చేసినప్పుడు జయప్రకాశ్‌ నారాయణ స్వాగతించారు.

రాజధానిపై మాట మార్చిన జేపీ?
X

మూడు రాజధానుల విషయంలో లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ గతానికి కాస్త భిన్నంగా మాట్లాడారు. గతంలో అసెంబ్లీలో జగన్‌మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణపై ప్రకటన చేసినప్పుడు జయప్రకాశ్‌ నారాయణ స్వాగతించారు. ఇప్పుడు మాత్రం అమరావతినే ఏకైక రాజధానిగా నిర్మించాలని డిమాండ్ చేశారు. రాజధానులను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ పూలింగ్ అన్నది దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సమ్మతితో జరిగిందని... రాజధాని నిర్మాణం జరిగితే.. ఆస్తుల విలువ పెరుగుతుందని భూములు ఇచ్చారన్నారు.

ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న తర్వాత వెనక్కు వెళ్లకూడదన్నారు. అందరూ కలిసి కూర్చోని చట్టబద్దంగా నిర్ణయం చేసిన తర్వాత... మరొకరు వచ్చి ఇది కాదు మరోక చోట అంటే ఎలా అని ప్రశ్నించారు. ఇలా రాజధానులను మార్చిన చరిత్ర తుగ్లక్‌కు ఉందన్నారు. పైగా ఇక్కడి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేవారు, రిస్క్ తీసుకునే వారు, భవిష్యత్తును పెంచాలని కసి ఉన్న వారు అధికంగా ఉన్నారని అలాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక మహానగరం అవసరం అని జేపీ చెప్పారు.

అయితే జగన్‌ మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత జేపీ 2019 డిసెంబర్‌లో స్వాగతించారు. ఒకే చోట కేంద్రీకృతం అయితే అదో లైసెన్స్ రాజ్యానికి చిహ్నంగా ఉంటుందని... అన్ని రాజధాని చుట్టే ఉండాలన్నది కాలం చెల్లిన విధానం అని విమర్శించారు. రాజధాని అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, హెచ్‌ఓడీలు, హైకోర్టు... ఇవన్నీ ఒకేచోట ఉండాల్సిన అవసరం లేదని 2019లో జేపీ వ్యాఖ్యానించారు.

First Published:  16 Oct 2022 1:04 PM GMT
Next Story