Telugu Global
Andhra Pradesh

తాగునీటి కోసం KRMB ని ఆశ్రయించిన ఏపీ... తెల‍ంగాణకు నీటి విడుదల చేయ‌వద్దని విజ్ఞప్తి

ఉమ్మడి రిజర్వాయర్లలో ఉన్న మొత్తం 126 టీఎంసీల నీరు ఏపీకి చెందుతుందని, తెలంగాణ ఇప్పటికే తన కోటా కంటే ఎక్కువగా వినియోగించుకున్నదని ఏపీ ప్రభుత్వం వాదించింది.

తాగునీటి కోసం KRMB ని ఆశ్రయించిన ఏపీ... తెల‍ంగాణకు నీటి విడుదల చేయ‌వద్దని విజ్ఞప్తి
X

తీవ్రమైన తాగునీటి అవసరాలను తీర్చడానికి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ (RMC) కింద ఆరుTMC, ఎడమ ప్రధాన కాలువ (LMC) కింద ఒక TMC నీటిని విడుదల చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB)ను అభ్యర్థించింది.

ఉమ్మడి రిజర్వాయర్లలో ఉన్న మొత్తం 126 టీఎంసీల నీరు ఏపీకి చెందుతుందని, తెలంగాణ ఇప్పటికే తన కోటా కంటే ఎక్కువగా వినియోగించుకున్నదని ప్రభుత్వం వాదించింది.

శనివారం నుంచే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ కేఆర్‌ఎంబీ చైర్మన్‌ శివ నందన్‌ కుమార్‌కు లేఖ రాశారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి కృష్ణా జలాల కోటాకు మించి దాదాపు 46.99 శాతం నీటిని వినియోగించుకుందని ఏపీ అధికారులు చెప్పారు.

ఒప్పందం ప్రకారం మొత్తం 961 టీఎంసీల నీటి వాటాలో ఏపీకి 634.40 టీఎంసీలు, తెల‍ంగాణ‌కు 326.76 టీఎంసీల కోటా ఉందని, అయితే ఏపీ కేవలం 470 టీఎంసీల మేర మాత్రమే వినియోగించుకోగా, తెలంగాణ 417 టీఎంసీల నీటిని వినియోగించుకుందని శశిభూషణ్ చెప్పారు.

రెండు రిజర్వాయర్లలో దాదాపు 126 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు. కృష్ణా బేసిన్ నుంచి ఏపీకి దాదాపు 163 టీఎంసీల నీరు రావాల్సి ఉందన్నారు. రిజర్వాయర్ల వద్ద కేవలం 126 టీఎంసీల నీరు ఉన్నందున కృష్ణా బేసిన్‌లో అందుబాటులో ఉన్న మొత్తం నిల్వలపై ఏపీకి పూర్తి హక్కు ఉందని కుమార్ చెప్పారు. తెలంగాణ ఇప్పటికే తన కోటా కంటే 90 టీఎంసీల కంటే ఎక్కువగా వినియోగించుకుందని, అందుకే కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నుంచి తాజాగా తెల‍ంగాణకు నీటి విడుదలకు అనుమతించరాదని ఆయన అన్నారు.

First Published:  15 April 2023 7:02 AM GMT
Next Story