Telugu Global
Andhra Pradesh

అన్ స్టాపబుల్ అంబటి.. పవన్ పై మళ్లీ సెటైర్లు

రక్తసంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా ? అంటూ అంబటి ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు. ఇక్కడ అన్నయ్యను కూడా అంబటి సీన్లోకి తీసుకు రావడం విశేషం.

అన్ స్టాపబుల్ అంబటి.. పవన్ పై మళ్లీ సెటైర్లు
X

ఆహా కోసం బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి వెళ్లారు పవన్ కల్యాణ్. పీఎస్పీకే విత్ ఎన్బీకే అంటూ ఈ టాక్ షో కి అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు అల్లు అరవింద్. ఇది బెస్ట్ ఎపిసోడ్ గా మిగిలిపోతుందని కూడా చెప్పారు. అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ టాక్ షోపై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. జనసేన-టీడీపీ బంధం బలపడేందుకు ఈ టాక్ షో ఉపయోగపడుతుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ దశలో వైసీపీ నుంచి సెటైర్లు పేలాయి. పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు పంచ్ లు విసిరారు.

అన్నయ్య షో కి డుమ్మా

బాలయ్య షో కి జమ్మ

రక్తసంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా ? అంటూ అంబటి ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు. ఇక్కడ అన్నయ్యను కూడా అంబటి సీన్లోకి తీసుకు రావడం విశేషం. చిరంజీవిని కూడా కలిపి పవన్ కల్యాణ్ పై అంబటి ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.


పవన్ కల్యాణ్ ఇప్పటివరకు టాక్ షో లకు వెళ్లలేదు. చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి కూడా పవన్ కల్యాణ్ వెళ్లలేదు. అందుకే అన్నయ్య షో కి డుమ్మా అంటూ అంబటి ఆటపట్టించారు. రక్త సంబంధం కంటే ప్యాకేజీ బంధమే గొప్పదంటూ బాలకృష్ణ టాక్ షో కి వచ్చారని సెలవిచ్చారు.

ఉలుకెందుకు..?

అన్ స్టాపబుల్ షో పై వైసీపీ చేస్తున్న విమర్శలను జనసైనికులు తీవ్రంగా ఖండించారు. అంబటికి అంత ఉలుకెందుకంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అన్ స్టాపబుల్ షో లో జగన్ పై పడే కౌంటర్ల గురించి అంబటి ఆందోళన చెందుతున్నట్టున్నారని జనసేన మద్దతుదారులు బదులిస్తున్నారు. మొత్తమ్మీద అన్ స్టాపబుల్ కి పవన్ కల్యాణ్ రావడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ కి బాగా క్రేజ్ వచ్చింది. అది స్ట్రీమింగ్ కి రాకముందే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ మొదలు పెట్టి అన్ స్టాపబుల్ షో కి మరింత హైప్ తీసుకొచ్చారు అల్లు అరవింద్. ఈ ఎపిసోడ్ లో పవన్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

First Published:  27 Dec 2022 11:26 AM GMT
Next Story