Telugu Global
Andhra Pradesh

నిన్న ముద్రగడ కుమార్తె, నేడు అంబటి అల్లుడు..

ఎన్నికలకు టైమ్ దగ్గరపడటంతో టీడీపీ రకరకాల వ్యూహాలు అమలు చేస్తోంది. నాయకులను టార్గెట్ చేస్తూ వారి కుటుంబ సభ్యుల్ని తెరపైకి తెస్తున్నారు.

నిన్న ముద్రగడ కుమార్తె, నేడు అంబటి అల్లుడు..
X

ఎక్కడ్నుంచి పట్టుకొస్తుందో తెలియదు కానీ.. వైసీపీ వైరి వర్గాన్ని చాలా తెలివిగా టీడీపీ హ్యాండిల్ చేస్తోంది. ఇటీవల ముద్రగడ పద్మనాభం కుమార్తె వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "అందరికీ నమస్తే నేను మీ బార్లపూడి క్రాంతి అంటూ " ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చేయించింది, దాన్ని వైరల్ చేసింది ఎల్లో బ్యాచ్ అనే విషయం అందరికీ తెలుసు. అయితే ముద్రగడ కుమార్తె కూడా ఆయన్ను వ్యతిరేకిస్తున్నారంటూ నీఛ రాజకీయం చేసింది ఎల్లో మీడియా. ఆ వీడియోకి ముద్రగడ రియాక్షన్ ని కూడా బాగా హైలైట్ చేస్తూ ఆయన్ని టార్గెట్ చేసింది.

అంబటి అల్లుడు..

తాజాగా అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ పేరుతో మరో వీడియో విడుదలైంది. అంబటి అల్లుడ్ని అని చెబుతున్న గౌతమ్.. ఆయనకు ఓటు వేయొద్దని ఓటర్లకు సందేశమిచ్చారు. మంచి నాయకుడిని ఎన్నుకోండి అని పిలుపునిచ్చారు. పనిలో పనిగా అంబటిపై చాలా ఆరోపణలు చేశారు. వారిద్దరి మధ్య ఎన్ని వ్యక్తిగత అభిప్రాయ భేదాలయినా ఉండొచ్చు, కుటుంబ కలహాలు ఉండొచ్చు. కానీ అలాంటి వారందర్నీ ఏరికోరి ఎన్నికల సమయంలో బయటకు తీసుకొచ్చి రచ్చ చేయడం ఇక్కడ టీడీపీ చేస్తున్న దుర్మార్గం. వైసీపీలో ఉన్న నాయకుల కుటుంబ కలహాలను తమకు అనుకూలంగా మార్చుకోడానికి, తమ రాజకీయ లాభాలకోసం టీడీపీ ఉపయోగించుకుంటోంది. ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా అలాంటి వారికి లేనిపోని ప్రచారం కల్పిస్తోంది.


ఎన్నికలకు టైమ్ దగ్గరపడటంతో టీడీపీ లేనిపోని కుయుక్తులన్నీ ప్రదర్శిస్తున్నట్టు తేలిపోయింది. నాయకులను టార్గెట్ చేస్తూ వారి కుటుంబ సభ్యుల్ని తెరపైకి తెస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితాలను కూడా బజారుకీడ్చాలని చూస్తున్నారు. సదరు నాయకులు ఘాటుగా స్పందిస్తే.. దాన్ని కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటోంది ఎల్లో బ్యాచ్.

First Published:  5 May 2024 5:25 AM GMT
Next Story