Telugu Global
Andhra Pradesh

నేను ముసలోడ్ని, చంద్రబాబూ ముసలోడే

ఏపీలో చంద్రబాబుకి ఒకటే దారి అని, సర్దుకో చంద్రన్న అంటూ నినాదాలు చేశారు అంబటి రాంబాబు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి గోవిందా గోవిందా అని అన్నారు.

నేను ముసలోడ్ని, చంద్రబాబూ ముసలోడే
X

తాను ముసలోడినని, చంద్రబాబు కూడా ముసలోడేనని.. వయసు పైబడటాన్ని అంగీకరించకపోతే ఎలా అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. రాత్రి 10 గంటలకు సభలు మొదలు పెట్టి, నేను కుర్రోడిని, జగన్ కంటే కుర్రోడిని అంటూ అరిస్తే ఎలా అని ఎద్దేవా చేశారు. అసలు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యే హక్కు చంద్రబాబుకు లేదని విమర్శించారు. ఎన్టీఆర్ మరణానికి కారణం కూడా చంద్రబాబే అని, ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచి గద్దె దించాడన్నారు.

అవి కాదు, ఈ వీడియోలు చూడండి..

ఎన్టీఆర్ ప్రసంగాలతో కూడిన ఓ పుస్తకాన్ని టీడీపీ విడుదల చేస్తున్న సందర్భంలో.. అసలు ప్రజలు చూడాల్సింది, తెలుసుకోవాల్సింది ఆ ప్రసంగాల గురించి కాదని, ఈ వీడియోల గురించి అని అన్నారు మంత్రి అంబటి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలను ఆయన తన సెల్ ఫోన్ లో చూపించారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో చంద్రబాబుని ఔరంగజేబుతో పోల్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ చావుకి కారణం అయిన చంద్రబాబు, ఆయన పేరిట ఉత్సవాలు చేస్తూ, పుస్తకాలు విడుదల చేయడం హాస్యాస్పదం అని చెప్పారు. చివరి రోజుల్లో ఎన్టీఆర్ ప్రసంగాలు వింటే చంద్రబాబు ఎలాంటివారో అర్థమవుతుందని అన్నారు.

తాను తురక అనిల్ కుటుంబానికి అన్యాయం చేశానని చెబుతున్న చంద్రబాబు, టీడీపీ తరపున ఆర్థిక సాయం చేశారని, అయితే ఆయనకు బాధితులపై ప్రేమ లేదని, కేవలం తనపై కక్ష ఉందన్నారు. తురక అనిల్ తో పాటు మరో ఇద్దరు కూడా ఆరోజు ప్రమాదంలో చనిపోయారని, వారి కుటుంబాలను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

సర్దుకో చంద్రన్న..

ఏపీలో చంద్రబాబుకి ఒకటే దారి అని, సర్దుకో చంద్రన్న అంటూ నినాదాలు చేశారు అంబటి రాంబాబు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి గోవిందా గోవిందా అని అన్నారు. సత్తెనపల్లిలో చంద్రబాబు సభలు అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. వయసైపోయిన చంద్రబాబు వచ్చే ఎన్నికలకోసం కష్టపడటం వృథా అని తేల్చేశారు అంబటి.

First Published:  28 April 2023 8:41 AM GMT
Next Story