Telugu Global
Andhra Pradesh

రీపోలింగ్ కి డిమాండ్ చేసిన అంబటి

ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని గతంలో అనుకునేవారని, కానీ ఈసారి సీఎం జగన్‌ కోసం తాపత్రయపడి జనం ఓట్లు వేశారన్నారు అంబటి రాంబాబు.

రీపోలింగ్ కి డిమాండ్ చేసిన అంబటి
X

పల్నాడు ప్రాంతంలో పోలీసు యంత్రాంగం అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు అంబటి రాంబాబు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడటంలో విఫలం అయ్యారని ఆరోపించారు. టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారని, తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. తమ కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడిందని, తనను తిరగకుండా అడ్డుకున్నారని అన్నారు. ఒక బూత్‌లో వెయ్యి ఓట్లు రిగ్గింగ్‌ చేశారని, రీపోలింగ్‌ నిర్వహించబోమని ముందుగానే ఈసీ చెప్పడం సరికాదన్నారు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్‌ జరిగిన పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.



అది పాజిటివ్ ఓటింగ్..

ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని గతంలో అనుకునేవారని, కానీ ఈసారి సీఎం జగన్‌ కోసం తాపత్రయపడి జనం ఓట్లు వేశారన్నారు అంబటి రాంబాబు. మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. మహిళలు 70 శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారని అన్నారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదని, జగన్ కోసం ఓటర్లు పడిన తపన, తాపత్రయం స్పష్టంగా కనిపించిందన్నారు అంబటి. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించిందని, పెరిగిన ఓటింగ్ అంతా పాజిటివ్ ఓటింగ్ అని తేల్చి చెప్పారు.

ఇది ప్రతిష్టాత్మక ఎన్నిక అని అన్నారు అంబటి రాంబాబు. ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని ముఖ్యమంత్రిగా జగన్‌ ఐదేళ్ల పాలన చూసి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని చెప్పారు.తమ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు తెగబడిందన్నారు అంబటి. చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వైసీపీవైపే ఉన్నారన్నారు. సత్తెనపల్లిలో తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టు చెప్పారు అంబటి రాంబాబు.

First Published:  14 May 2024 8:25 AM GMT
Next Story