Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి బెయిల్ రాదు, ఆయనపై సింపతీ లేదు

చంద్రబాబు నోరు పారేసుకుని ఇప్పుడు జైలులో ఉన్నారని చెప్పారు అంబటి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఏమీ చేయలేకపోయారని, తనను ఏంపీకుతారంటూ చంద్రబాబు నోరు పారేసుకున్నారని, రెండు పీకి సీఐడీ వాళ్లు జైలులో పెట్టారని సెటైర్లు పేల్చారు.

చంద్రబాబుకి బెయిల్ రాదు, ఆయనపై సింపతీ లేదు
X

చంద్రబాబు రాజకీయ జీవితం ఖతం అయిపోయిందని, ఇక ఆయనకు రాజకీయ భవిష్యత్ లేదని, మరోసారి ముఖ్యమంత్రి కావడం అసంభవం అని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ముఖ్యమంత్రిగా పనిచేసినవాళ్లు జైలుకెళ్లొచ్చిన తర్వాత వారికి భవిష్యత్తు ఉండదన్నారు. ఆయనపై కేసులు బలంగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాదన్నారు. అసలు ప్రజల్లో కూడా చంద్రబాబుపై సింపతీ లేదన్నారు. ఆయన జైలుకెళ్లిన తర్వాత సింపతీ వస్తుందని టీడీపీ వాళ్లు భావించారని, కానీ అక్కడ అంత సీన్ లేదన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినవారిని, ప్రజా ధనం దోచుకున్నవారిని జైలులో పెడితే సింపతీ రాదన్నారు అంబటి. ఆయన తప్పు చేశారని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారన్నారు. లోయర్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అవుతున్నాయని, అంటే ఆధారాలు పక్కాగా ఉన్నాయని తేలిపోయిందన్నారు అంబటి.

నోరుపారేసుకోవద్దు.. ఒళ్లు జాగ్రత్త

చంద్రబాబు నోరు పారేసుకుని ఇప్పుడు జైలులో ఉన్నారని చెప్పారు అంబటి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఏమీ చేయలేకపోయారని, తనను ఏంపీకుతారంటూ చంద్రబాబు నోరు పారేసుకున్నారని, రెండు పీకి సీఐడీ వాళ్లు జైలులో పెట్టారని సెటైర్లు పేల్చారు అంబటి. నారా లోకేష్ కూడా నోరు పారేసుకుంటున్నాడని.. ఒళ్లు జాగ్రత్త అని హెచ్చరించారు. అసలు లోకేష్ అడుగు పెట్టిన తర్వాతే టీడీపీ మలమల మాడిపోయిందన్నారు. సీఐడీ విచారణ తర్వాత బయటకొచ్చి నీతి నిజాయితీ గురించి లోకేష్ మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు అంబటి.

జగన్ కి భయం పరిచయం చేస్తావా..?

సీఎం జగన్ కి భయాన్ని పరిచయం చేస్తానన్న నారో లోకేష్... చంద్రబాబు అరెస్ట్ కాగానే ఢిల్లీకి పారిపోయారన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు అరెస్ట్ అయితే, కొంతమంది గుండె ఆగిపోయి చనిపోయారంటూ అసత్యాలు ప్రచారం చేశారని, మరి ఆ కుటుంబాలను పరామర్శించాల్సిన బాధ్యత లోకేష్ కి లేదా అని ప్రశ్నించారు. తండ్రి అరెస్ట్ అయితే లోకేష్ డైపర్ వేసుకుని ఢిల్లీకి పారిపోయారన్నారు.

పెళ్లికి వెళ్తూ చంకలో పిల్లి..

పెళ్లికి వెళ్తూ ఎవరూ పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్లరని, కానీ టీడీపీ.. పవన్ కల్యాణ్ అనే పిల్లిని చంకలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలనుకుంటోందని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి. టీడీపీ పనైపోయిందని, టీడీపీ వీక్ అయిపోయిందంటూ ఆ పిల్లి మాట్లాడుతోందన్నారు. టీడీపీ కనీసం 23 సీట్లయినా గెలిచిందని, పవన్ కల్యాణ్ ఒక్కచోట కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.

First Published:  11 Oct 2023 6:21 AM GMT
Next Story