Telugu Global
Andhra Pradesh

చంద్రబాబును నమ్మితే ఇంతే సంగతులా?

నిజానికి శుక్రవారం అంత గొడవ జరిగిన తర్వాత శనివారం చంద్రబాబు పుంగనూరు పట్టణంలోనే ఉండుంటే నేతలు, క్యాడర్‌కు నైతిక స్థైర్యంగా ఉండేదేమో. కానీ వీళ్ళ ఖర్మకు వీళ్ళని వదిలేసి చిత్తూరు, శ్రీకాళహస్తిలో పర్యటించారు.

చంద్రబాబును నమ్మితే ఇంతే సంగతులా?
X

40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును నమ్మకుంటే ఏమవుతుందో నేతలు, క్యాడర్‌కు ఇప్పుడు బాగా తెలిసొచ్చినట్లుంది. శుక్రవారం మధ్యాహ్నం నుండి కొన్ని గంటలపాటు పోలీసులు-టీడీపీ నేతలు, క్యాడర్‌కు, టీడీపీ నేతలు-వైసీపీ క్యాడర్‌కు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఒక‌రిపై మ‌రొక‌రు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. రక్తాలు వచ్చేలా, తలలు పగిలేలా కొట్టుకున్నారు. దెబ్బలు తిన్నవాళ్ళల్లో అత్యధికులు ఆసుపత్రుల్లో చిక్సిత‌ తీసుకున్నారు.

తమ్ముళ్ళని రెచ్చగొట్టిన చంద్రబాబేమో హ్యాపీగా టూర్లో ఉన్నారు. పుంగనూరు ఘటనలకు పూర్తి బాధ్యత చంద్రబాబుదే అనటంలో సందేహంలేదు. పుంగనూరు బైపాస్ రోడ్డు మీద నుండి నేరుగా చిత్తూరుకు వెళ్ళాల్సిన చంద్రబాబు సడెన్‌గా పుంగనూరులోకి ఎంటరయ్యారు. పట్టణంలోకి చంద్రబాబును ఎంటర్ కానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో నేతలు, క్యాడర్‌కు మధ్య గొడవలయ్యాయి. ఇంతలో వైసీపీ నేతలు, క్యాడర్ అక్కడకు చేరుకుని పోలీసులకు మద్దతుగా నిలబడ్డారు. దాంతో టీడీపీ నేతలు, క్యాడర్ ఇటు పోలీసుల మీద అటు వైసీపీ శ్రేణుల మీద ఏకకాలంలో దాడులు చేశారు.

దాడుల్లో రెండు వైపులా చాలా మందికి గాయలయ్యాయి. టీడీపీ క్యాడర్‌ను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పిన చంద్రబాబు హాయిగానే ఉన్నారు. మధ్యలో నేతలు, క్యాడర్‌కు ఇప్పుడు చావొచ్చిపడింది. ఎలాగంటే తమ్ముళ్ళ దాడుల్లో సుమారు 20 మంది పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. రెండు పోలీసు వాహనాలను తమ్ముళ్ళు తగలబెట్టేశారు. పోలీసుల మీద దాడులు చేసిన వాళ్ళని, వాహనాలను తగలబెట్టినవాళ్ళని పోలీసులు గుర్తించారు.

మొత్తం అల్లర్లు వీడియోల్లో రికార్డ్ అయ్యాయి. వీడియో సాక్ష్యాల ఆధారంగా ఇప్పటికి 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వాళ్ళ కోసం గాలిస్తున్నారు. వీడియోల్లో కనిపించిన వాళ్ళల్లో ఎవ్వరినీ పోలీసులు వదిలిపెట్టరు. తమపై దాడులు చేసినవాళ్ళని, తమ వాహనాలకు నిప్పుపెట్టిన వాళ్ళని పోలీసులు వదిలేస్తారని తమ్ముళ్ళు ఎలా అనుకున్నారో? వాళ్ళ ఇళ్ళు, బంధువులతో పాటు ఫ్రెండ్స్ ఇళ్ళను కూడా పోలీసులు గాలిస్తున్నారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా వాళ్ళని పట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు.

నిజానికి శుక్రవారం అంత గొడవ జరిగిన తర్వాత శనివారం చంద్రబాబు పుంగనూరు పట్టణంలోనే ఉండుంటే నేతలు, క్యాడర్‌కు నైతిక స్థైర్యంగా ఉండేదేమో. కానీ చంద్రబాబు వీళ్ళ ఖర్మకు వీళ్ళని వదిలేసి తాను వెళిపోయారు. చిత్తూరు, శ్రీకాళహస్తిలో పర్యటించారు. పుంగనూరు అల్లర్లలో పాల్గొన్న వాళ్ళంతా ఎక్కడ దాక్కోవాలో తెలీక నానా అవస్థ‌లు పడుతున్నారు. పోలీసు ట్రీట్‌మెంట్‌ తర్వాత కోర్టుల చుట్టూ తిరగటం, జైలు తప్పేట్లులేదు.

First Published:  6 Aug 2023 4:24 AM GMT
Next Story