Telugu Global
Andhra Pradesh

శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసిన బోరుగడ్డ అనిల్ కార్యాలయం దగ్ధం

సజ్జలను విమర్శిస్తే ఊరుకోబోనని అనిల్ చెప్పిన నేపథ్యంలో ఆ మరుసటి రోజే శ్రీధర్ రెడ్డి ప్రెస్‌ మీట్ పెట్టి మరోసారి సజ్జలపై విరుచుకుపడ్డారు. బోరుగడ్డ అనిల్‌తో ఫోన్ చేయించిందే సజ్జల రామకృష్ణారెడ్డి అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.

శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసిన బోరుగడ్డ అనిల్ కార్యాలయం దగ్ధం
X

ఇటీవల వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగిన వైసీపీ అభిమాని బోరుగడ్డ అనిల్‌ కార్యాలయానికి కొంద‌రు దుండగులు నిప్పుపెట్టారు. గుంటూరులోని డొంకరోడ్డు వద్ద ఉన్న అనిల్‌ ఆఫీస్‌కు అర్ధరాత్రి సమయంలో నిప్పుపెట్టారు. కార్యాలయం పూర్తిగా కాలిపోయింది. జగన్‌ ఫ్లెక్సీలు బూడిదయ్యాయి.

పార్టీపై తిరుగుబాటు చేసిన శ్రీధర్‌ రెడ్డికి ఫోన్‌ చేసిన బోరుగడ్డ అనిల్.. నెల్లూరు వచ్చి బండికి కట్టేసి కడపకు ఈడ్చుకొస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి జగన్‌, సజ్జలను విమర్శిస్తే ఐదు నిమిషాల్లో నెల్లూరుకు వచ్చి ఈడ్చుకొస్తా అంటూ బూతులు తిట్టారు. ఆ సమయంలో చంద్రబాబు, నారా లోకేష్‌లను అనిల్‌ బూతులు తిట్టారు. ఈ ఆడియో దుమారం రేపింది. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి జగన్‌ను ఎవరు విమర్శించినా వారికి ఫోన్ చేసి చంపేస్తా, నరికేస్తా అంటూ బూతులు తిడుతుంటారు.

సజ్జలను విమర్శిస్తే ఊరుకోబోనని అనిల్ చెప్పిన నేపథ్యంలో ఆ మరుసటి రోజే శ్రీధర్ రెడ్డి ప్రెస్‌ మీట్ పెట్టి మరోసారి సజ్జలపై విరుచుకుపడ్డారు. బోరుగడ్డ అనిల్‌తో ఫోన్ చేయించిందే సజ్జల రామకృష్ణారెడ్డి అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. మరోసారి కాల్ చేయిస్తే నెల్లూరు నుంచి సజ్జలకు నేరుగా వీడియో కాల్సే వెళ్తాయని హెచ్చరించారు. ఆదివారం కొందరు టీడీపీ నాయకులు కూడా బోరుగడ్డ అనిల్ కార్యాలయం వద్దకు వెళ్లి హల్‌చల్ చేశారు.

ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్‌ కార్యాలయం తగలబడిపోవడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందో చూడాలి.

First Published:  7 Feb 2023 4:15 AM GMT
Next Story