Telugu Global
Andhra Pradesh

ప్రియుడితో భ‌ర్త‌ను చంపించిన భార్య‌

త‌మ వివాహేత‌ర సంబంధం కొన‌సాగించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో అందుకు అడ్డుగా ఉన్నాడ‌ని భావించి భ‌ర్త‌నే శాశ్వ‌తంగా అడ్డు తొల‌గించుకోవాల‌నుకుంది.

ప్రియుడితో భ‌ర్త‌ను చంపించిన భార్య‌
X

తన వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌ని భ‌ర్త‌నే తుద‌ముట్టించాల‌నుకుంది ఓ భార్య‌. అనుకున్న‌దే త‌డ‌వుగా ప్రియుడితో క‌లిసి ప‌న్నాగం ప‌న్ని కుట్ర‌ను అమ‌లు చేసింది. అన‌కాప‌ల్లి జిల్లాలో జ‌రిగిన‌ ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను నర్సీపట్నం ఏఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా మంగళవారం రాత్రి విలేక‌రుల‌కు వెల్ల‌డించారు.

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటకు చెందిన గుడివాడ అప్పలనాయుడు (33), జానకి (24) భార్యాభర్తలు. ప‌నుల‌కు వెళ్లిన సంద‌ర్భంగా జానకికి పాతకృష్ణదేవిపేటకు చెందిన తాపీమేస్త్రీ చింతల రాము (34)తో ప‌రిచ‌యం ఏర్ప‌డి వివాహేత‌ర సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ రోజూ ఫోన్‌లో మాట్లాడుకోవడం గమనించిన భర్త.. జానకిని పని మాన్పించాడు.

త‌మ వివాహేత‌ర సంబంధం కొన‌సాగించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో అందుకు అడ్డుగా ఉన్నాడ‌ని భావించి భ‌ర్త‌నే శాశ్వ‌తంగా అడ్డు తొల‌గించుకోవాల‌నుకుంది. అందుకోసం ప్రియుడితో క‌లిసి ప‌న్నాగం ప‌న్ని.. ఆచ‌ర‌ణ‌లో పెట్టింది. భ‌ర్త‌తో ప్రేమ‌గా ఉంటున్న‌ట్టు న‌టించి.. అత‌న్ని ఈనెల 20న కోటవురట్ల మండలం పాములవాకలోని పట్టాలమ్మతల్లి గుడికి తీసుకువెళ్లింది. తిరుగుప్రయాణంలో తాండవ నది గట్టు దాటాక బహిర్భూమికి వెళ్లాలంటూ బైకు ఆపించి రోడ్డుపక్కన ఉన్న‌ జీడితోటలోకి తీసుకువెళ్లింది.

ఆ త‌ర్వాత తోట‌లో కాసేపు కూర్చుందామని చెప్పి.. భ‌ర్త త‌ల‌ను ఒడిలో పెట్టుకుని కూర్చుంది. అప్పటికే అక్కడ కాచుకుని ఉన్న తాపీ మేస్త్రీ రాము.. సుత్తితో అప్ప‌ల‌నాయుడు తలవెనుక బలంగా కొట్టాడు. దీంతో అత‌ను అక్కడికక్కడే కుప్ప‌కూలిపోయాడు. అనంత‌రం ఇద్ద‌రూ క‌లిసి రాళ్ల‌తో కొట్టి అత‌న్ని హ‌త‌మార్చారు. అనంత‌రం మృతదేహాన్ని అక్క‌డినుంచి రోడ్డు పైకి చేర్చారు. రాము అక్కడి నుంచి వెళ్లిపోగా జానకి అక్కడే ఉండి రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయాడంటూ వచ్చి, పోయేవారిని నమ్మించే ప్రయత్నం చేసింది. గాయాల తీరుపై స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచార‌ణ చేయ‌గా, హత్యకు గురైనట్టు గుర్తించారు. నిందితులు జాన‌కి, రాముల‌ను అరెస్ట్ చేశారు.

*

First Published:  23 Aug 2023 2:49 AM GMT
Next Story