Telugu Global
Andhra Pradesh

వైసీపీ గెలుస్తుందని 30కోట్ల బెట్టింగ్‌.. కట్‌ చేస్తే అనుమానాస్పద స్థితిలో మృతి

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున వేణుగోపాల్‌రెడ్డి బెట్టింగ్‌లు నిర్వహించాడు. 10 శాతం కమీషన్‌పై సుమారు రూ. 30 కోట్ల వరకు బెట్టింగ్ సొమ్ము సేకరించాడు.

వైసీపీ గెలుస్తుందని 30కోట్ల బెట్టింగ్‌.. కట్‌ చేస్తే అనుమానాస్పద స్థితిలో మృతి
X

ఎన్నికల బెట్టింగ్ ఊబిలో ఓ వైసీపీ నేత బలయ్యారు. అధికార పార్టీ విజయం ఖాయమని వైసీపీ నాయకుల పందేల్లో మధ్యవర్తిగా వ్యవహరించి అత్యాశతో తన చేతికి వచ్చిన సొమ్మును మరో పందెంలో కాసి దెబ్బతిన్నాడు. గెలిచిన వ్యక్తులకు సొమ్ము ఇవ్వలేక అజ్ఞతంలోకి చేరుకుని.. అనూహ్యంగా తన ఫార్మ్‌హౌస్‌లో శవంగా ప్రత్యక్షం కావటం సంచలనంగా మారింది. టీడీపీ నేతలే హత్య చేశారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

మ్యాటర్‌లోకి వెళ్తే.. మృతుడు వేణుగోపాల్‌రెడ్డిది ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామం. ఈయన భార్య వైసీపీ సర్పంచ్‌. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున వేణుగోపాల్‌రెడ్డి బెట్టింగ్‌లు నిర్వహించాడు. 10 శాతం కమీషన్‌పై సుమారు రూ. 30 కోట్ల వరకు బెట్టింగ్ సొమ్ము సేకరించాడు. మంచి వ్యక్తి , సౌమ్యుడిగా పేరుండటంతో వేణుగోపాల్‌ రెడ్డిని బెట్టింగ్ మధ్యవర్తిగా నమ్మారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటంతో పందెంలో గెలిచిన వ్యక్తులు డబ్బుల కోసం వేణుగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చనిప్పటి నుంచి వేణుగోపాల్ రెడ్డి గ్రామంలో కనిపించకుండా పోయాడని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇటీవల పందెం రాయుళ్లు తమ సొమ్ములు తమకు చెల్లించాలని వేణుగోపాల్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. భీమవరం నుంచి వచ్చిన వ్యక్తులు ఏకంగా ఇంట్లో సామానులను తమ వాహనాల్లో తరలించుకు పోయారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆదివారం వేణుగోపాల్‌రెడ్డి తన ఫామ్ హౌస్‌లో అనుమానాస్పదస్థితిలో చనిపోయి ఉండటం కలకలం రేగింది. పందెంరాయుళ్ల ముసుగులో టీడీపీ నేతలే వేణుగోపాల్‌ రెడ్డిని చంపి ఫామ్‌హౌస్‌లో పడేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

First Published:  10 Jun 2024 9:42 AM GMT
Next Story