Telugu Global
Andhra Pradesh

పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపారు.. స్నేహితులే నిందితులు

అతడు చనిపోయే ముందు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తనపై తన స్నేహితుడు వెంకటేశ్వర రెడ్డి, మరికొందరు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు చెప్పాడు.

పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపారు.. స్నేహితులే నిందితులు
X

మనుషుల్లో నేర స్వభావం రోజురోజుకీ పెరిగిపోతోంది అని చెప్పడానికి సరైన ఉదాహరణ ఈ ఘటన. పట్టుమని పదహారేళ్లు కూడా నిండని ఓ బాలుడు తన స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు. మామూలుగా ఒకరినొకరు చంపుకొనేంత గొడవలు పిల్లల మధ్య ఏముంటాయి..? మారిన జీవనశైలి, సోషల్ మీడియా, సినిమాల ప్రభావం పిల్లలపై పడుతోంది. హత్య ఏ విధంగా చేయాలి..? ఆ తర్వాత ఎలా తప్పించుకోవాలి..? అని ఇప్పుడు చాలామంది యూట్యూబ్ లో చూసి తెలుసుకుంటున్నారు. చిన్నచిన్న గొడవలకే నేరాలకు పాల్పడుతున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

చెరుకుపల్లె మండలం రాజోలు పంచాయతీ పరిధి ఉప్పరవారి పాలెంకు చెందిన ఉప్పల అమర్నాథ్ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ ఉదయం అతడు పక్కనే ఉన్న రాజోలుకు ట్యూషన్ కోసం వెళుతుంటాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కూడా రాజోలికి బయలుదేరాడు. దారిలో రెడ్లపాలెం వద్ద అమర్నాథ్‌ని అతడి స్నేహితుడైన వెంకటేశ్వర రెడ్డి, మరికొందరి విద్యార్థులు ఆపారు.

అమర్నాథ్ పై బలవంతంగా పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు అంటుకోవడంతో అమర్నాథ్ కేకలు పెడుతుండగా గ్రామస్తులు గమనించారు. వెంటనే స్పందించిన వారు మంటలను ఆర్పి విద్యార్థిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూనే అమర్నాథ్ మృతి చెందాడు.

అయితే అతడు చనిపోయే ముందు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తనపై తన స్నేహితుడు వెంకటేశ్వర రెడ్డి, మరికొందరు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు చెప్పాడు. చెరుకుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమర్నాథ్ హత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పదో తరగతి చదువుతున్న బాలుడిని స్నేహితులే అతి కిరాతంగా చంపడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

First Published:  16 Jun 2023 5:50 AM GMT
Next Story