ప్రాణం తీసిన బలగం.. ఇది రివర్స్ కేస్

ఊరంతా ఒకేచోట చేరి తెరపై బలగం సినిమా చూశారు. అయితే కొంతమంది యువకులు మద్యం తాగి అక్కడ గొడవ చేశారు. ఈ గొడవలో ఒకరి ప్రాణం పోయింది.

Advertisement
Update: 2023-04-10 09:40 GMT

కుటుంబ బాంధవ్యాల గురించి చక్కగా వివరించిన బలగం సినిమా విడిపోయిన చాలా కుటుంబాలను దగ్గర చేసింది. చూసిన ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో బలగం సినిమాని తెరలపై ప్రదర్శించడం సరికొత్త ఆనవాయితీగా మారింది. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సిిినిమాల కాలంలో ఊరంతా కలసి తెరపై సినిమా చూసేవాళ్లు. మళ్లీ ఇప్పుడు ఆ సంప్రదాయం తెచ్చిన బలగం సిినిమా అందరినీ ఆకట్టుకుంది. అవార్డులు, రివార్డులకు లెక్కే లేదు. అయితే ఇప్పుడు బలగం సినిమా ప్రదర్శన ఓ యువకుడి ప్రాణం పోవడానికి పరోక్ష కారణంగా మారింది.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం గ్రామంలో ఆదివారం రాత్రి బలగం సినిమా ప్రదర్శించారు. ఊరంతా ఒకేచోట చేరి తెరపై బలగం సినిమా చూశారు. అయితే కొంతమంది యువకులు మద్యం తాగి అక్కడ గొడవ చేశారు. ఈ గొడవలో ఒకరి ప్రాణం పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

బలగం సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న యువకులు వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దది కావడంతో ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. ఓ వర్గం వాళ్లు ఇనుప రాడ్లు తీసుకొచ్చి దాడి చేయడంతో గుర్రం ప్రవీణ్, వెంకటేష్‌ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన వెంకటేష్‌ ను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. శివరాత్రి నరేష్, భాగ్యరాజ్ అనే ఇద్దరు యువకులు దాడికి పాల్పడినట్టు గుర్తించారు. మల్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. 

Tags:    
Advertisement

Similar News