నిజామాబాద్ లో కలకలం.. అర్బన్ స్వతంత్ర అభ్యర్థి ఆత్మహత్య

లోన్ యాప్ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కన్నయ్య గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా నిజామాబాద్ అర్బన్ లో నామినేషన్ వేశారు. స్క్రూటినీ తర్వాత అతనికి రోటీ మేకర్ గుర్తు కేటాయించారు.

Advertisement
Update: 2023-11-19 04:57 GMT

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కలకలం రేగింది. ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న యమగంటి కన్నయ్య గౌడ్ అనే అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి ఫోన్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే కన్నయ్య గౌడ్ కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. రెండు రోజుల్లో గృహప్రవేశం కూడా ఉంది. ఇంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. లోన్ యాప్ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కన్నయ్య గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా నిజామాబాద్ అర్బన్ లో నామినేషన్ వేశారు. స్క్రూటినీ తర్వాత అతనికి రోటీ మేకర్ గుర్తు కేటాయించారు.

ఎన్నికలపై ప్రభావం ఉంటుందా..?

నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి చనిపోవడంతో ఎన్నిక జరుగుతుందా లేదా అనే కలకలం రేగింది. అయితే సదరు అభ్యర్థి ఇండిపెండెంట్ కావడంతో.. ఎన్నికపై ఆ ప్రభావం ఉండదని తెలుస్తోంది. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి చనిపోతే ఎన్నిక వాయిదా పడే అవకాశముంది. కానీ ఇక్కడ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది స్వతంత్ర అభ్యర్థి కాబట్టి.. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం లేదని అంటున్నారు.

నిజామాబాద్ అర్బన్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన గణేష్ బిగాల మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ధనపురి సూర్యనారాయణ గుప్తా, కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ ఇక్కడ పోటీ చేస్తున్నారు. గణేష్ గుప్తా హ్యాట్రిక్ గ్యారెంటీ అనే అంచనాలున్నాయి. 

Tags:    
Advertisement

Similar News