కేసీఆర్ ప్రభుత్వంపై కవిత ట్వీట్.. ఇంట్రెస్టింగ్..!

ఓ దినపత్రికలో వచ్చిన కథనం తనను ఎంతో కలచివేసిందన్నారు. కేసీఆర్ నాయత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలకు తావు ఉండకూడదని చెప్పారు.

Advertisement
Update: 2023-08-13 04:51 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత.. ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇటీవల హైదరాబాద్ పరిధిలోని ఓ బాలికల స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్‌లో.. ఓ ఉన్నతాధికారి ప్రవర్తన, బాలికల మీద వేధింపులపై మీడియాలో కథనాలు వచ్చాయి. సాయంత్రం దాటిందంటే చాలు ఆ అధికారి ఆగడాలు హద్దు మీరుతున్నాయని, హాస్టల్ లోని బాలికలు, సిబ్బంది కూడా వణికిపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనపై కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ దినపత్రికలో వచ్చిన కథనం తనను ఎంతో కలచివేసిందన్నారు. కేసీఆర్ నాయత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలకు తావు ఉండకూడదని చెప్పారు. ఓ బాలికపై లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయి విచారణ జరిపించాలన్నారు. బాధితుల‌ను గుర్తించి న్యాయం చేయాలంటూ.. క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కూడా ట్యాగ్ చేశారు.


ట్విట్ట‌ర్‌లో కవిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి తీవ్రమైన ఘటనలపై.. విపక్షాలు విరుచుకుపడేముందే అధికార పార్టీకి చెందిన అగ్రనాయకురాలైన కవిత ఇలా ట్వీట్ చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. ఆమె స్వయంగా చేసిన విజ్ఞప్తికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం స్పందించారు.


ఈ ఘటనపై ఉన్నతాధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్ చేస్తామన్నారు. బాలికలు, మహిళలపై ఇలాంటి వేధింపులను తమ ప్రభుత్వం ఏ మాత్రం ఉపేక్షించబోదని తేల్చిచెప్పారు. నిందితులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Tags:    
Advertisement

Similar News