ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారీగా క్రాస్ ఓటింగ్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చ జరుగుతోంది. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై కోపంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update: 2024-05-27 13:07 GMT

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, న‌ల్లగొండ ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌ ప్రశాంతంగా ముగిసింది. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. 4 గంట‌ల్లోపు క్యూలైన్లో నిల్చున్న వారికి ఓటేసేందుకు అధికారులు అవ‌కాశం క‌ల్పించారు. పోలింగ్ శాతం 60 దాటింది. జూన్ 5న ఉపఎన్నిక ఫ‌లితం రానుంది.

విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చ జరుగుతోంది. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై కోపంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ నేతలు ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తీన్మార్ మల్లన్న అనుచరులు డబ్బులు పంచుతుండగా అడిగినందుకు తమ మీద దాడి చేశారని పోలీస్ స్టేషన్ ముందు స్వతంత్ర అభ్యర్థి అశోక్‌గౌడ్ ఆందోళనకు దిగారు. చౌటుప్పల్‌లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లకి డబ్బులు పంచారు. ఖమ్మం సాయిగణేష్ నగర్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో డబ్బులు పంచడంతో పట్ట‌భద్రులు బారులు తీరారు. హన్మకొండ ప్రశాంత్ నగర్‌లోని తేజస్వి స్కూల్ పోలింగ్ బూత్‌లోకి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వెంట 10 మందిని లోపలికి ఎలా పంపిస్తారని ఓటర్లు ఆందోళనకు దిగారు.

బరిలో 52 మంది..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆ నియోజకవర్గానికి ఇవాళ ఉపఎన్నిక నిర్వహించారు. ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. అధికార కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల‌ రాకేశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్‌ రెడ్డి పోటీపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News