కవిత ఇంట్లో ఈడీ సోదాలు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కలకలం

సోదాల నేపథ్యంలో కవిత ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. కవిత సిబ్బంది ఫోన్‌లను ఈడీ అధికారులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Update: 2024-03-15 10:52 GMT

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ శనివారం విడుదల అవుతున్న వేళ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అధికారుల సోదాలు కలకలంగా మారాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు 4 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

సోదాల నేపథ్యంలో కవిత ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. కవిత సిబ్బంది ఫోన్‌లను ఈడీ అధికారులు తీసుకున్నట్లు తెలుస్తోంది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారలపైనా అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈడీ నోటీసులకు సంబంధించి కవిత పిటిషన్‌పై విచారణను ఈనెల 19కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే రెండు సార్లు కవితను విచారించింది ఈడీ. ఇటీవల మరోసారి నోటీసులు జారీ చేయగా.. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో బిజీగా ఉన్నానని, హాజరుకాలేనని కవిత రిప్లై ఇచ్చారు. ఇక తాజా సోదాలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కక్షతోనే సోదాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News