మోదీ దత్తపుత్రులు.. దేశం వదిలి పారిపోయారు

మన్ కీ బాత్ 100 ఎపిసోడ్ లలో మోదీ 100 అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు నారాయణ. అది మన్ కీ బాత్ కాదని, అసత్యాల బాత్ అని అన్నారు.

Advertisement
Update: 2023-05-05 02:19 GMT

ప్రధాని నరేంద్రమోదీకి మొత్తం 30మంది దత్తపుత్రులు ఉన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అయితే మోదీ దత్తపుత్రులంతా ఇప్పుడు భారత దేశంలో లేరని చెప్పారు. వారంతా దేశంలో అప్పులు చేసి విదేశాలకు పారిపోయారని సెటైర్లు వేశారు. దేశ సంపద అంతా అంబానీ, అదానీలకే దక్కిందని విమర్శించారు నారాయణ.

100 ఎపిసోడ్ లు.. 100 అబద్ధాలు..

మన్ కీ బాత్ 100 ఎపిసోడ్ లలో మోదీ 100 అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు నారాయణ. అది మన్ కీ బాత్ కాదని, అసత్యాల బాత్ అని అన్నారు. జీఎస్టీ రూపంలో వచ్చిన 1లక్ష ఎనభై వేల లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కేంద్రం ఎవరికి దోచిపెట్టిందని ప్రశ్నించారు. పేదవాడు వేసుకునే చెప్పుల పైనా మోదీ ప్రభుత్వం జీఎస్టీ వేస్తోందని అన్నారు. ఆఖరికి శ్మశానంలో కాల్చే శవం మీద కూడా జీఎస్టీ వేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అక్రమాలపై సీపీఐ పోరాటం చేస్తుందని చెప్పారు.

బీఆర్ఎస్ పై అలక..

తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి తమకి ఆహ్వానం లేదని అలక వహించారు నారాయణ. బీఆర్ఎస్ తో తమకు రాజకీయ పరమైన కలయిక లేదని స్పష్టం చేశారు. 

Tags:    
Advertisement

Similar News