న్యాయమూర్తి శునకం కిడ్నాప్.. 12 మందిపై కేసు నమోదు

న్యాయమూర్తికి చెందిన శునకం కనిపించకుండా పోయింది. దీంతో తమ శునకాన్ని అహ్మద్ కుటుంబీకులే కిడ్నాప్ చేసి ఉంటారని న్యాయమూర్తి బరేలి పోలీసులకు ఫిర్యాదు చేశారు

Advertisement
Update: 2024-05-24 07:17 GMT

న్యాయమూర్తి పెంపుడు కుక్క‌ కిడ్నాప్ కావడంతో 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. బరేలిలోని సన్ సిటీ కాలనీలో నివాసం ఉంటున్న ఓ సివిల్ జడ్జి హర్దోయ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, సన్ సిటీ కాలనీలో న్యాయమూర్తి ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు.

ఈ శునకం విషయంలో పొరుగింట్లో ఉండే డంపీ అహ్మద్ కుటుంబానికి, న్యాయమూర్తి కుటుంబానికి మధ్య వివాదం తలెత్తింది. అహ్మద్ కుమారుడు ఖాదిర్ ఖాన్ న్యాయమూర్తి కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఇదిలా ఉంటే.. జడ్జికి చెందిన శునకం తన పైన, తన కూతురిపైన దాడి చేసిందని ఇటీవల అహ్మద్ భార్య న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో మరోసారి గొడవకు దిగింది.

ఆ తర్వాత న్యాయమూర్తికి చెందిన శునకం కనిపించకుండా పోయింది. దీంతో తమ శునకాన్ని అహ్మద్ కుటుంబీకులే కిడ్నాప్ చేసి ఉంటారని న్యాయమూర్తి బరేలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యానిమల్ క్యూయల్టీ చట్టం కింద 12 మందిపై కేసు నమోదు చేశారు. అపహరణకు గురైన శునకం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News